ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు…. ఆ ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు, ట్రీట్‌మెంట్, సర్జరీలు కూడా ఫ్రీ

ప్రస్తుత రోజుల్లో విద్య. వైద్యం అనేవి అందరికీ అందని ద్రాక్షపండులాగా మారిపోయాయి. నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలు సగటు మనిషికి భారంగా మారుతున్నాయి.


ఇలాంటి పరిస్థితుల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించే ఆస్పత్రి ఉందంటే నమ్ముతారా. ఆ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలు మాత్రమే కాదు అవసరమైన సర్జరీలను కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉంది ఈ ఆస్పత్రి. శాస్త్రీయ నృత్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన కూచిపూడిలో పూర్తి ఉచితంగా సేవలు అందిస్తోంది రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి. భారతీయ జనతా పార్టీ నేత సాధినేని యామిని శర్మ ఇటీవల ఈ ఆస్పత్రిని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి విశేషాలు చెప్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

“భారతదేశ శాస్త్రీయ నృత్య రాజధాని కూచిపూడి మధ్యలో ఉన్న ఒక అసాధారణ ఆసుపత్రిని సందర్శించాను. ఆస్పత్రిని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అదో ప్రపంచ స్థాయి ఆసుపత్రి, పూర్తిగా దాతృత్వంతో నడుస్తుంది. రోగ నిర్ధారణ, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలను కూడా సున్నా ఖర్చుతో ప్రజలకు అందిస్తుంది. బిల్లు లేదు. షరతులు లేవు. వివక్ష లేదు. సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల దార్శనికతతో, సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ సహా మరెంతో మంది సహకారంతో ఇది ఏర్పాటైంది. ఈ ఆస్పత్రిలో అధునాతన వైద్య పరికరాల నుంచి మౌలిక సదుపాయాల వరకు ప్రతిదీ నిబద్ధత, కరుణ, దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఆసుపత్రి కాదు. ఇది మానవత్వం,సేవ., నిజమైన దేశ నిర్మాణం ఇలా ఉంటుంది” అంటూ సాదినేని యామిని శర్మ ట్వీట్ చేశారు.

మరోవైపు కూచిపూడి గ్రామంలో 200 పడకల సౌకర్యంతో సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆసుపత్రి ఏర్పాటు చేశారు. సిలికాన్ ఆంధ్ర మద్దతుతో పాటుగా విరాళాల సాయంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు రవి ప్రకాష్ ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం అప్పట్లో భారీగా ఆర్థిక సాయం అందించారు. కూచిపూడి సహా దాని పరిసరాల్లోని 70 గ్రామాల ప్రజలకు ఈ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.

ఈ ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్‌తో పాటు కార్డియాలజీ, గైనకాలజీ, చిన్న పిల్లల విభాగాలను ఏర్పాటు చేశారు. ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆస్పత్రి అందుబాటులోకి రావటంతో ఈ ప్రాంత వాసులు ఆధునిక వైద్యం కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరం తప్పుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.