చలాన్లను చెక్ చేసేందుకు లింకులు క్లిక్ చేయండనిహైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఇప్పటి వరకు సాధారణ పౌరులను బురిడి కొట్టించిన కేటుగాళ్లు కొన్ని రోజుల క్రితం సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ సతీమణి ఊర్మిళను పెట్టుబడుల పేరిట 2.58 కోట్ల రూపాయలను ముంచడం సంచలనం రేపింది.
దీనిపై విచారణ సాగుతుండగానే (Cyber Crime)తాజాగా నగర పోలీసు విభాగంలోని ఖైరతాబాద్ డిసిపి శిల్పవల్లికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో వున్నాయని లింకులు పంపి టోకరా వేసేందుకు యత్నించారు. అయితే డిసిపి శిల్పవల్లి దీనిపై అప్రమత్తమై సంచార్ సాథి పోర్టల్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఈ తరహా నేరాలపై అప్రమత్తంగా వుండాలని ప్రజలను కోరారు. వివరాలు ఇలా వున్నాయి.
డిసిపి శిల్పవల్లికి సైబర్ కేటుగాళ్ల సందేశాలు
ఖైరతాబాద్ (Khairatabad) డిసిపి శిల్పవల్లి ఫోన్కు కొన్ని మెసేజ్లు వచ్చాయి. మీ వాహనం ఓవర్ స్పీడ్తో వెళ్లింది…దీనికి సంబంధించిన చలాన్లు పెండింగ్లో వున్నాయి. (Cyber Crime) వీటిని చూడాలంటే మేము పంపే లింకులను క్లిక్ చేయండి. అని సైబర్ నేరగాళ్లు డిసిపి శిల్పవల్లికి వరుసగా సందేశాలు పంపారు. మీ వాహనం అనేకచోట్ల ఓవర్ స్పీడ్తో వెళ్లింది… దీనిని సిసి కెమెరాలు గుర్తించాయి. చలాన్లు వెంటనే చెల్లించండి… ఇందుకోసం సెల్ఫోన్లో లింకులు పంపుతున్నాం. వాటిని క్లిక్ చేసి తెలుసుకోండి… అంటూ వరుసగా మెసేజ్లు పంపారు. చివరగా ట్రాఫిక్ నియమాలు పాటించండి అని మరో సందేశం పంపారు. అయితే సైబర్ నేరగాళ్ల లింకులకు డిసిపి శిల్పవల్లి క్లిక్ చేయకుండా నేరుగా సంచార్ సాథి పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఈ తరహా లింకులపై అందరు నిరంతరం అప్రమత్తంగా వుండాలని డిసిపి శిల్పవల్లి ఎక్స్ ద్వారా కోరారు.































