YS Jagan : జగన్ ఓటమిలో ఇదొక కోణం.. ఎవరూ అంచనా వేయలేకపోయారే..

YS Jagan : తాగుబోతోడి(మద్యం ప్రియులు క్షమించాలి) శపథం తరాలపాటు ఉంటుందట.. అలాంటి శపథమే మద్యం ప్రియులు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించారు.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజమని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మద్యం ప్రియులు అధికార వైసిపికి తాము ఓటు వేయకుండా.. ఇతరులతో ఓట్లు వేయించకుండా చేశారు. అలాగని వారేమీ కూటమి నాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఏమైనా సహకారాలు అందుకుంటామని మాట తీసుకోలేదు. కానీ అలా వారు గుంప గుత్తగా ఓటు వేయడానికి ప్రధాన కారణం.. “బ్రాండెడ్” హామీ లభించడమే. దాంతో వారు వెనకడుగు వేయలేదు.. ఫలితంగా కూటమికి జై కొట్టారు.. మూడు పార్టీలను గెలిపించారు. వాస్తవానికి ఈ దిశగా ఏ మీడియా సంస్థ ఆలోచించలేదు. సెఫాలజిస్టులు అంచనా వేయలేదు..


ఏపీలో 2019లో 151 సీట్లతో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక రకాల నిర్ణయాలు తీసుకున్నారు. అందులో సరికొత్త మద్యం బ్రాండ్లను తెరపైకి తీసుకురావడం ఒకటి. అప్పటిదాకా ఏపీలో రకరకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉండేవి. అయితే అవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీలకు చెందినవి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏనాడూ కలగజేసుకోలేదని ఆబ్కారీ అధికారులు నేటికి చెబుతుంటారు. కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. పైగా అప్పటిదాకా ఉన్న పేరు పొందిన బ్రాండ్లను పక్కనపెట్టి.. “స్పెషల్ స్టేటస్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్”, ఇంకా రకరకాల బ్రాండ్ల విస్కీలు, బీర్లు ప్రవేశపెట్టారు. ప్రవేశపెడితే పెట్టారు గాని.. మద్యం తాగే వాళ్ళు అడిగే బ్రాండెడ్ వెరైటీస్ లేకుండా చేశారు.. ఒక్క మాన్షన్ హౌస్ (బ్రాందీ) దీనిని బాలయ్య బాబు మీద అభిమానంతో మార్కెట్లో ఉంచారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇది తప్ప మద్యం ప్రియులు తాగే ఇతర రకాలు లభించే పరిస్థితి లేకుండా పోయింది. తాగితే ఆ దిక్కుమాలిన బ్రాండ్లు తాగాలి. లేకపోతే మూసుకొని కూర్చోవాలి. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి తీసుకొస్తే సరిహద్దుల్లో అధికారులు పట్టుకునేవారు. దీంతో దొంగ చాటుగా సరుకు తెప్పించుకొని మద్యం ప్రియులు తాగేవారు.. ఇలా ఐదేళ్లపాటు మద్యం ప్రియులకు తాము కోరుకున్న బ్రాండ్ మందు దొరకలేదు.. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. అటు నచ్చిన మందు తాగకుండా.. ఇబ్బంది పడడం ఎందుకని మద్యం ప్రియుల్లో ఒక ఆలోచన వచ్చింది.. ఇదే సమయంలో మద్యం ప్రియులు కోరుకునే బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంచుతానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చెప్పడంతో.. ఒకసారి గా వారిలో ఆలోచన మారింది.

వారి ఆలోచన మారిన ఫలితం ఎన్నికల్లో కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు..”మద్యం తాగేవారు పూర్తిగా కూటమికి ఓట్లు వేశారు.. ఎందుకంటే మద్యం తాగడం అనేది వారికి ఒక స్టేటస్ సింబల్. ఆ స్టేటస్ సింబల్ మీద జగన్ దెబ్బ కొట్టాడు. తనకు నచ్చిన బ్రాండ్లను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేసి.. మిగతా బ్రాండ్లను తొక్కిపడేశాడు. జగన్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన బ్రాండ్లు మొత్తం నాడు వైసిపి నాయకులవే. వాటిని కనిపించకుండా చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చాడు. అందువల్లే మద్యం ప్రియులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. కూటమికి జై కొట్టి గెలిపించారు. బహుశా ఇక వారు కోరుకునే బ్రాండ్లు లభిస్తాయి కావచ్చని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి లక్షల కోట్లు పెట్టి పథకాలు ప్రవేశ పెడితే.. జగన్ కు అన్ని వర్గాలు దూరమయ్యాయి. చివరికి మద్యం ప్రియులు కూడా జగన్ పార్టీని కాదన్నారు. కూటమికి జై కొట్టారు.