Andhra News: 9 నెలల మిస్టరీ.. 10 రోజుల్లో వీడింది -పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో కదిలిన పోలీసులు

పటమట: పోలీసులు సవాలుగా తీసుకుంటే ఏ కేసునైనా ఛేదించగలరు అనడానికి ఉదాహరణే ఈ ఉదంతం. తొమ్మిది నెలల కిందట విజయవాడలో అదృశ్యమైన యువతి జాడను కనిపెట్టడంలో ఇన్నాళ్లూ నిర్లిప్తంగా ఉన్న పోలీసులు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో పది రోజుల్లోనే జమ్మూలో గుర్తించారు. యువతితో పాటు ఆమె స్నేహితుడిని విమానంలో విజయవాడకు తరలిస్తున్నారు. జూన్‌ 22న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పవన్‌.. మాచవరం సీఐ గుణరాముకు ఫోన్‌ చేసి మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి, యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. దీంతో విజయవాడ నగర సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.


కేరళ నుంచి జమ్మూ దాకా..
భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్‌రావు, శివకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోంది. అదే కళాశాల సీనియర్‌ విద్యార్థి, విజయవాడ శివారు నిడమానూరుకు చెందిన అంజాద్‌ అలియాస్‌ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని లోబరుచుకున్నాడు. గతేడాది అక్టోబర్‌ 28న రాత్రి వీరిద్దరూ హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బుల్లేక ఫోన్లు, నగలు అమ్మేశారు. తర్వాత కేరళ, ముంబై, దిల్లీలో తిరుగుతూ చివరకు జమ్మూకు చేరారు. అక్కడ హోటల్‌లో అంజాద్‌ పనికి కుదిరాడు. ఇతరులతో మాట్లాడేందుకు తేజస్వినికి ఫోన్‌ ఇచ్చేవాడు కాదు. ఓ రోజు అంజాద్‌ లేని సమయంలో అతని ఫోన్‌ నుంచే తేజస్విని తన అక్కకు ఇన్‌స్టాగ్రాంలో మెసేజ్‌ పెట్టింది. ఈ చిన్న ఆధారం ద్వారా వివరాలు రాబట్టిన పోలీసులు.. వారు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. చిరునామాను అక్కడి పోలీసులకు పంపించారు. వారు పోలీసు బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరిని బుధవారం మధ్యాహ్నానికి విమానంలో విజయవాడకు తీసుకురానున్నారు.

సీపీకి ఉపముఖ్యమంత్రి అభినందనలు
తన కుమార్తె ఆచూకీ లభించిన తర్వాత తేజస్విని తల్లి శివకుమారి విజయవాడ పోలీసు కార్యాలయంలో సీపీ రామకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌.. పవన్‌ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేసు ఛేదించిన తీరును వివరించారు. ‘కిడ్నాప్‌ చేశారా?’ అని పవన్‌ సీపీని ప్రశ్నించగా.. కాదని, వారు ఇక్కడికి వచ్చాక మరిన్ని వివరాలు రాబడతామన్నారు. యువతిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కృషి చేసినందుకు సీపీ రామకృష్ణను పవన్‌ అభినందించారు.