చపాతీ, రోటీలు మధుమేహులకు కీడు చేస్తాయా? వాటికి బదులు ఏం తింటే వ్యాధి ముదరకుండా ఉంటుంది

www.mannamweb.com


Chapathi: డయాబెటిస్ ఉన్నవారికి గోధుమ పిండితో చేసిన చపాతీ, రోటీలు అనారోగ్యకరమా? వారు ఈ ఆహారాన్ని తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదా? ఆహర నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

డయాబెటిస్ రోగులు ఏం తినాలన్న దానిపై చర్చ నిత్యం సాగుతూనే ఉంటుంది. ఆహార నిపుణులు డయాబెటిస్ రోగుల డైట్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉంటారు. వాటిని బట్టి డయాబెటిస్ రోగులు ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అయితే ముంబైకి చెందిన సీనియర్ డైటీషియన్ రియా దేశాయ్ మాట్లాడుతూ డయాబెటిస్ వారికి చపాతీలు, రోటీలు ఎలాంటి మేలు చేయవని చెబుతున్నారు. వీటిని తినడం ఉపయోగం లేదని వివరిస్తున్నారు. గోధుమపిండితో చేసిన ఈ ఆహారానికి బదులు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తినడం ప్రారంభించాలని ఆమె సలహా ఇస్తున్నారు.

చపాతీలు వద్దు, మరి ఏం తినాలి?

జొన్నలు, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అలాగే అధిక ఫైబర్ కంటెంట్ తో నిండి ఉంటాయి. దీనివల్ల వాటితో చేసిన ఆహారాలు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. వారి వ్యాధి ముదరకుండా ఉంటుంది. చిరుధాన్యాలు మధుమేహుల పాలిట వరం అనే చెప్పుకోవాలి అంటున్నారు రియా దేశాయ్. ఈ ధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, త్వరగా పొట్ట నిండేలా చూడడానికి సహాయపడతాయి.

శుద్ధి చేసిన పిండితో చేసిన చపాతీలు, రోటీలు ఎంచుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయని రియా దేశాయ్ హెచ్చరిస్తున్నారు. చిరుధాన్యాలు అయితే శరీరంలో నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయని, శక్తిని స్థిరంగా విడుదల చేస్తాయని ఆమె చెబుతున్నారు. గ్లూకోజ్ హెచ్చుతగ్గులను కూడా ఇవి నివారిస్తాయని అంటున్నారు.

చిరుధాన్యాలలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి డయాబెటిస్ అధికంగా ఉండే వారిలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయని తెలుస్తోంది. ఈ చిరుధాన్యాలు మెగ్నీషియంతో నిండి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. మీకు డయాబెటిస్ ఉంటే, మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కష్టపడుతుంటే, చిరుధాన్యాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.

గోధుమ పిండి కొంతమందికి అలెర్జీని కలిగిస్తుంది. కోలియాక్ వ్యాధి, అందులో ఉండే గ్లూటెన్ అరిగించుకోలేకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు గోధుమపిండితో చేసిన ఏ ఆహారాన్ని తినకూడదు. గ్లూటెన్ తినడం వల్ల ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు. కాబట్టి గోధుమ పిండిని పక్కన పెట్టి చిరు ధాన్యాలతో చేసిన రొట్టెలు, గంజి, పానీయాలు, బ్రెడ్లు వంటివి వండుకుని తింటే అన్ని విధాలా మంచిది.

చిరుధాన్యాలలో కరిగే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్నందున, అవి కొలెస్ట్రాల్, అథెరోస్క్లెరోసిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాల్షియం, జింక్, ఇనుముతో సహా ముఖ్యమైన ఖనిజాలు చిరుధాన్యాలలో పుష్కలంగా ఉంటాయి. చిరుధాన్యాలు ఎల్లాజిక్ ఆమ్లం, కర్కుమిన్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.