జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌

జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌


జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి పలు విద్యార్థి సంఘాలు. పేపర్‌ లీకేజీలను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్‌ పాటించాలని చెప్పాయి.

బంద్‌కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు విద్యార్థి సంఘం నాయకులు. నీట్‌, నెట్‌ పేపర్‌ లీకేజీలకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్‌టీఏను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలంటున్నారు. ఇవే డిమాండ్‌లతో జూలై 4న బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోవైపు నీట్‌ అక్రమాలను నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు పార్లమెంట్‌ మార్చ్‌ చేపట్టనున్నాయి. జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థుల నిరవధిక నిరసనలు ఆరు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. నీట్‌

నీట్‌-యూజీలో ఓఎంఆర్‌ షీట్‌ మ్యానిపులేషన్‌ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ తర్వాత ఈ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ పరీక్ష రాసిన ఓ విద్యార్థి ఈ పిటిషన్‌ను దాఖలు చేశాడు. పిటిషనర్‌ రాసిన ఓఎంఆర్‌ షీటును మార్చేశారని ఆయన తరపు న్యాయవాది ఆరోపించారు. దీనిపై వెకేషన్‌ బెంచ్‌ స్పందిస్తూ, జూన్‌ 23న జరిగిన రీటెస్ట్‌కు హాజరయ్యేందుకు పిటిషనర్‌ అనుమతి కోరారని తెలిపింది. ఆ పరీక్ష అయిపోయిందని చెప్పింది. దీనిపై రెండు వారాల తర్వాత విచారణ జరపాలని ఎన్టీఎ న్యాయవాది కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.