ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎక్కువ మంది రాగులను తమ డైలీ డైట్లో భాగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోషకాలు పుష్కలంగా ఉండే రాగులతో చాలా మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జావ, ఇడ్లీ, దోశ, సంగటి, పొంగనాలు ఇలా రకరకాల వంటకాలు చేసుకొని ఆరగిస్తున్నారు. అయితే, ఆరోగ్యానికి మేలు చేసే ఈ చిరుధాన్యాలతో కేవలం టిఫెన్స్ మాత్రమే కాకుండా సగ్గుబియ్యంతో కలిపి ఇలా కమ్మని “పాయసం” ప్రిపేర్ చేసుకోండి. ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. పైగా శ్రావణ మాసం నడుస్తుండడంతో ఈ పద్ధతిలో సింపుల్గా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగానూ నివేదించవచ్చు. పిల్లలైతే గ్లాసులో ఈ పాయసాన్ని పోసిచ్చారంటే చుక్క మిగల్చకుండా తాగేస్తారు. అంతేకాదు, ఈ స్వీట్ పాలు విరగకుండా, చల్లారినా గట్టి పడకుండా ఉంటుంది! మరి, రాగి పిండితో ఈ రుచికరమైన సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- సగ్గుబియ్యం – అర కప్పు
- రాగి పిండి – అర కప్పు
- నెయ్యి – రెండు టేబుల్స్పూన్లు
- జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్స్పూన్
- బాదం పలుకులు – రెండు టేబుల్స్పూన్లు
- సన్నని ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్స్పూన్
- కిస్మిస్లు – రెండు టేబుల్స్పూన్లు
- బెల్లం తురుము – రెండు కప్పులు
- యాలకుల పొడి – ఒక చెంచా
- కాచి చల్లార్చిన పాలు – రెండు కప్పులు
-
తయారీ విధానం :
- ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పాయసం ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక కప్పు వరకు నీళ్లు పోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాయసం తయారీ కోసం అందుకు అనుగుణంగా ఉండే గిన్నెను పెట్టుకొని ఆరు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి.
- తర్వాత అందులో అరగంటపాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకొని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఆ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి.
- సగ్గుబియ్యం ఉడికేలోపు స్టవ్ మరో బర్నర్ మీద ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, సన్నగా కట్ చేసుకున్న ఎండుకొబ్బరి ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- అవి సగం వరకు వేగాక కిస్మిస్లను జత చేసి అన్నింటినీ ఎర్రగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం మిగిలిన నెయ్యిలో రాగి పిండిని వేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక చిన్నపాటి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
- తర్వాత అందులో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ఉడికించుకుంటున్న సగ్గుబియ్యం మంచిగా ఉడికాయనుకున్నాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని మరోసారి కలిపి ఆ మిశ్రమంలో పోసి ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి.
- రాగిపిండి మిశ్రమం బాగా ఉడికి చిక్కగా మారి బబుల్స్ వస్తున్నప్పుడు బెల్లం తురుముని యాడ్ చేసి కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగేలా మరో మూడ్నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
- అలా ఉడికించినప్పుడు ఆ మిశ్రమం మరికాస్త చిక్కగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని బాగా కలిపి పాన్ని దింపి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
- ఆ మిశ్రమం కొద్దిగా వేడి తగ్గిన తర్వాత అందులో కాచి చల్లారిన పాలను పోసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి.
- ఆపై ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, యమ్మీ యమ్మీగా నోరూరించే “సగ్గుబియ్యం రాగిపిండి పాయసం” రెడీ అయిపోతుంది!
చిట్కాలు :
- ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్న కప్పునే బెల్లం తురుము, వాటర్, మిగతా ఇంగ్రీడియంట్స్ కొలవడానికి వాడుకోవాలి.
- ఒకవేళ మీరు స్వీట్ కాస్త తక్కువ తినేవారు అయితే బెల్లాన్ని ఒకటిన్నర కప్పుల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
- రాగి పిండి మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేసుకోవద్దు. అలా చేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే, కాస్త చల్లారిన తర్వాత మాత్రమే పాలు పోసి కలుపుకోవాలి.




































