నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్గా రుచికరమైన రెసిపీలు ప్రిపేర్ చేసుకోవడానికి తగినంత టైమ్ ఉండకపోవచ్చు. అలాగే, కొన్నిసార్లు ఇంట్లో సమయానికి ఇడ్లీ, దోశ పిండి వంటివి అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ రెసిపీ ఉంది. అదే, కమ్మగా నోరూరించే “ఉగ్గాని”. కర్నూలు స్టైల్లో మరమరాలతో అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీ చాలా రుచికరంగా ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి మాత్రమే కాకుండా ఈవెనింగ్ స్నాక్గానూ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో చేసుకునే దీన్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉగ్గానిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :
- మరమరాలు(బొరుగులు) – 2 నుంచి 3 కప్పులు
- పుట్నాలు – పావు కప్పులో సగం
- ఎండుమిర్చి – రెండు
- కరివేపాకు – కొద్దిగా
- పచ్చిమిర్చి – ఒకట్రెండు
- అల్లం – చిన్న ముక్క
- నూనె – ఒకట్రెండు టేబుల్స్పూన్లు(తగినంత)
- ఆవాలు – పావుటీస్పూన్
- జీలకర్ర – పావుటీస్పూన్
- సన్నని ఉల్లిపాయ తరుగు – పావు కప్పు
- టమాటాలు – రెండు(చిన్నవి)
- పసుపు – కొద్దిగా
- ఉప్పు, కారం – టేస్ట్కి సరిపడా
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
-
తయారీ విధానం :
- రాయలసీమ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండే ఉగ్గాని తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో మరమరాలను తీసుకోవాలి. ఆపై అందులో అవి మునిగే వరకు వాటర్ పోసుకొని రెండు మూడు నిమిషాలు నానబెట్టాలి.
- మరమరాలు చక్కగా నానిన తర్వాత వాటిని చేతిలోకి కొద్దికొద్దిగా తీసుకుంటూ అదనపు వాటర్ పిండేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు, ఎండుమిర్చి వేసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టి ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి.
- తర్వాత అదే మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద పాన్లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
- అవి వేగాక సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని ఒకట్రెండు నిమిషాలు ఆనియన్స్ దోర దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత టమాటా ముక్కలు, కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ టమాటాలు కాస్త సాఫ్ట్గా మారేంత వరకు మగ్గించాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని సన్నని సెగ మీద ఒకనిమిషం పాటు అవన్నీ కలిసేలా వేయించాలి.
- ఆపై అందులో నానబెట్టి ప్లేట్లోకి తీసుకున్న మరమరాలు, గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని రెండు టేబుల్స్పూన్ల వరకు వేసుకొని మిశ్రమం మొత్తం చక్కగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి.
- తర్వాత లో ఫ్లేమ్లో మరమరాలు కాస్త వేడి అయ్యేంత వరకు కలుపుతూ మూడ్నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక చివర్లో కొద్దిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, రాయలసీమ స్టైల్లో వేడి వేడిగా కమ్మని “ఉగ్గాని” రెడీ అయిపోతుంది!
































