గణపతి నవరాత్రి ఉత్సవాలకు (Ganesh Festival) యావత్ దేశం సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలను ముస్తాబు చేయనున్నారు. ఖరీదైన గణేశ్మూర్తులు, భారీ సెట్టింగ్లతో తాత్కాలిక మండపాలు ప్రతి ఏటా ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ముంబయిలోని ఓ గణేశ్ మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారని జాతీయ మీడియా కథనం పేర్కొంది.
ముంబయి (Mumbai) శివారులోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి 71వ వార్షికోత్సవం జరగనుంది. దేశంలోనే సంపన్న వినాయకుడి (Richest Ganpati)గా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా చేయించారట. ఇక్కడి విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించనుండటమే అందుక్కారణం. గతేడాది సైతం ఈ గణేశ్ మండపానికి రూ.400.58 కోట్లకు బీమా చేయించినట్లు నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బందికి రూ.375 కోట్లకు వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకున్నారు. గణపయ్యకు అలంకరించే బంగారం, వెండి, ఆభరణాలకు రూ.67 కోట్ల బీమా వర్తించనుంది. 2023, 2024ల్లో ఆ మొత్తం రూ.38 కోట్లు, రూ.43 కోట్లుగా ఉంది.
అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో రెండు కోట్ల రూపాయల బీమా తీసుకున్నారు. అక్కడి ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద రూ.30 కోట్లు కేటాయించారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను కూడా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు.































