హెచ్-1బీ వీసాలతో ఎక్కువ లబ్ధి భారత్‌కే- ఆ వీసాల జారీ ఒక స్కామ్

హెచ్-1బీ వీసాలు ఎక్కువగా భారత్‌కే జారీ అవుతున్నాయ్- వాటితో భారతీయులే భారీగా సంపాదిస్తున్నారు విదేశీ వర్కర్లపై అమెరికా ఆధారపడటం ఎందుకు ?- ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీసాంటిస్ సంచలన వ్యాఖ్యలు

US On H1b Visa : హెచ్-1బీ వీసాలతో భారతదేశమే ఎక్కువ లబ్ధి పొందుతోందని అమెరికా ఆరోపిస్తుంది. ఎక్కువగా హెచ్-1బీ వీసాలు భారతీయులకే జారీ అవుతున్నాయని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రాన్ డీసాంటిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీసాల వ్యవస్థను వాడుకొని భారతీయులు భారీగా సంపాదిస్తున్నారని రాన్ డీసాంటిస్ చెప్పారు. దేశ పౌరులకు ప్రాధాన్యతను ఇవ్వడానికి బదులుగా విదేశీ వర్కర్లపై అమెరికా ఆధారపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అమెరికన్ పౌరులకు ఉద్యోగ అవకాశాలను పెంచి, వారి సంక్షేమానికి చేయూత అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బుధవారం రోజు అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాన్ డీసాంటిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘హెచ్-1బీ వీసా ప్రోగ్రాం మొత్తం ఒక స్కామ్’
“హెచ్-1బీ వీసా ప్రోగ్రాం మొత్తం ఒక స్కామ్” అని రాన్ డీసాంటిస్ ఆరోపించారు. అమెరికన్ వర్కర్ల స్థానంలో విదేశీ కార్మికులను భర్తీ చేసుకునేందుకు హెచ్-1బీ వీసాలను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కంపెనీలు తరచుగా హెచ్-1బీ వీసాదారులతో పాటు అమెరికన్ ఉద్యోగులకు శిక్షణ ఇస్తుంటాయని, అమెరికన్లను తొలగించి, విదేశీ వర్కర్లను తీసుకోవడమే దీని లక్ష్యంగా ఉంటోందన్నారు. కంపెనీల ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, వీటివల్ల అమెరికన్ వర్కర్లకు నష్టం జరుగుతోందని ఆయన తెలిపారు.

ఈ వీసాల లక్ష్యం వేరు- వాస్తవికత వేరు
హెచ్-1బీ వీసాల అంశంపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో చీలికపై విలేకరి ప్రశ్నించగా రాన్ డీసాంటిస్‌ ఇలా బదులిచ్చారు. హెచ్-1బీ వీసాల ప్రక్రియను పలు అమెరికా కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పుకోవడం కరెక్టుగా ఉంటుందన్నారు. పెద్దసంఖ్యలో అమెరికన్లను ఉద్యోగాల నుంచి తప్పించి, విదేశీ వర్కర్లను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్-1బీ వీసాలను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కంపెనీలు యధేచ్ఛగా ఈ వీసాలను రెన్యూవల్ కూడా చేస్తున్నాయని రాన్ డీసాంటిస్‌ తెలిపారు. హెచ్-1బీ వీసాల ద్వారా ప్రపంచంలోని అత్యుత్తమ ట్యాలెంట్‌ను అమెరికా కంపెనీలు పొందుతున్నాయని కొందరు చెబుతుంటారని, అయితే వాస్తవికత ఇందుకు భిన్నంగా ఉందన్నారు.

“హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీ వ్యవస్థలను మార్చేస్తాం”
ఇంతకుముందు ఇదే అంశంపై అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వీసాల జారీ వ్యవస్థలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రత్యేకించి హెచ్-1బీ వీసా ప్రోగ్రాం, గ్రీన్ కార్డుల జారీ వ్యవస్థల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని, వాటిని మార్చాలని సర్కారు భావిస్తోందని వెల్లడించారు. దేశంలో రూ.43 కోట్లు (5 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టే విదేశీయులకు గోల్డ్ కార్డును జారీచేసి, అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల మంది అమెరికా గోల్డ్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారని హోవర్డ్ లుట్నిక్ చెప్పారు. వారందరికీ గోల్డ్ కార్డును జారీ చేస్తే, అమెరికాకు దాదాపు 1.25 ట్రిలియన్ డాలర్ల రాబడి వస్తుందన్నారు.

ట్రంప్ వైఖరి మారిందా ? మారలేదా ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో, ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా వ్యవస్థకు మద్దతు ప్రకటించారు. దానివల్లే అమెరికా కంపెనీలకు ప్రపంచంలోని అత్యుత్తమ ట్యాలెంట్ లభిస్తోందని కొనియాడారు. అయితే తొలిసారి(2017 – 2021) అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్ హెచ్-1బీ వీసాల జారీ వ్యవస్థపై పలు పరిమితులను విధించారు. దాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆనాడు ఆయన ఆరోపించారు. ఈ వీసాల జారీ వల్ల అమెరికా ప్రభుత్వంపైనా ఆర్థికభారం పడుతోందన్నారు. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో తక్కువ శాలరీకే పనిచేసేందుకు సిద్ధమైపోయే విదేశీ వర్కర్లను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్-1బీ వీసాలను కంపెనీలు వాడుతున్నాయని 2016లో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రాన్ డీసాంటిస్ చేసిన వ్యాఖ్యలు కూడా అదే కోణంలో ఉండటం గమనార్హం.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.