Jaya Badiga: కాలిఫోర్నియాలో తెలుగు మహిళ.. ఎంపీ కూతురుకు అరుదైన గౌరవం..

Jaya Badiga: ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారు కనిపిస్తారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా.. అందులో తెలుగోడి ప్రావీణ్యం కనిపిస్తుంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి కోర్టు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జయ బాడిగ.. తాజాగా శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దీంతో కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు మహిళగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. కోర్టు కమిషనర్‌గా పనిచేసిన సమయంలో జయ బాడిగ ఫ్యామిలీ లాలో జయ నిపుణురాలిగా పేరు సంపాదించుకున్నారు. టీచర్‌గానూ, మెంటార్‌గానూ వ్యవహరించారు.


మాజీ ఎంపీ కూతురు..
మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కూతురే జయ బాడిగ. ఆమె విజయవాడలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని హైదరాబాద్‌లో పూర్తి చేశారు. 1991 నుంచి 1994 వరకూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేశారు. తర్వాత అమెరికా వెళ్లిన ఆమె బోస్టన్‌ యూనివర్సిటీలో ఇంటర్ణేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఎంఏ పూర్తి చేశారు. తర్వాత శాంటా క్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో జూరిస్ డాక్టర్ పట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేశారు.

పదేళ్లుగా న్యాయవాద వృత్తిలో..
జయ బాడిగ సుమారు పదేళ్లు న్యాయవాద వృత్తితో కొనసాగారు. అంతకు ముందు కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలోని అత్యవసర సేవల విభాగంలో విధులు నిర్వహించారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లో అటార్నీగా పనిచేశారు. 2022 నుంచి శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జి రాబర్ట్ లాఫమ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో.. ఆ స్థానంలో జడ్జిగా నియమితులయ్యారు జయ బాడిగ.