కృష్ణాష్టమి స్పెషల్ నేతి హల్వా.. రవ్వతో ఇలా టేస్టీగా చేసి ప్రసాదంగా పెట్టేయండి

www.mannamweb.com


కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఎంతో ఇష్టమైన నేతితో పలు రకాల వంటలు చేసి ఆ కృష్ణుడి అనుగ్రహం పొందొచ్చు. అలాంటి వాటిలో నేతితో చేసే హల్వా (Ghee Halwa Recipe) ఒకటి. దీనిని చాలా సింపుల్​గా, టేస్టీగా చేసేయొచ్చు. అయితే టేస్టీగా అని ఎందుకు చెప్తున్నామంటే.. మనం తినేవాటిలో రుచి మంచిగా ఉండాలి అని ఎలా అనుకుంటామో.. దేవుడి ప్రసాదాలు కూడా అంతే రుచిగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయాన్ని ఏ పండుగకు, ఏ ప్రసాదం చేసినా గుర్తించుకోవాలి. ఇంతకీ ఈ నేతి హల్వాను ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు

నెయ్యి – ముప్పావు కప్పు

బాదం – రెండు టేబుల్ స్పూన్స్

జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్

ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూన్

రవ్వ – 1 కప్పు

శెనగపిండి – 2 టేబుల్ స్పూన్స్

పాలు – 1 కప్పు

నీళ్లు – రెండు కప్పులు

కుంకుమ పువ్వు – 2 టేబుల్ స్పూన్స్

పంచదార – ముప్పావు కప్పు

యాలకుల పొడి – చిటికెడు

నెయ్యి – పావు కప్పు
తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో నెయ్యి వేసి బాదం పలుకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. మంటను సిమ్​లో ఉంచి డ్రై ఫ్రూట్స్​ని రోస్ట్ చేయాలి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుంకుమపువ్వు నానబెట్టుకోవాలి. అనంతరం అదే కడాయిలో కప్పు రవ్వ వేయాలి. దానిలో శనగపిండి వేయాలి. వీటిని కూడా బాగా కలుపుతూ చిన్నమంట మీద వేయించుకోవాలి. నెయ్యి, రవ్వ, పిండి పూర్తిగా కలిసే వరకు మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి.

ఈ మిశ్రమం రంగు మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకుంటూ ఉండాలి. ఈలోపు మరోస్టౌవ్ వెలిగించి దానిలో ఓ కప్పు పాలు వేయాలి. దానిలో రెండు కప్పుల నీరు వేయాలి. నానబెట్టుకున్న కుంకుమ పువ్వును ఈ పాలల్లో వేసి బాగా కలపాలి. పాలల్లో కుంకుమపువ్వు కలిశాక.. పాలను మరగనివ్వాలి. పాలు మరిగే సరికి రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి సువాసన వస్తుంది. ఈ సమయంలో మరిగించిన పాలను ఈ రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి.

ఉండలు లేకుండా మిశ్రమాన్ని కలుపుకోవాలి. అప్పుడు పాలు రవ్వను పూర్తిగా పీల్చుకుంటాయి. బాగా కలిపిన తర్వాత దానిపై మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించాలి. రవ్వ కాస్త మెత్తగా మారుతుంది. ఇప్పుడు దానిలో పంచదార వేసి.. బాగా కలపాలి. పంచదార కరిగి రవ్వలో కలిసిపోయేవరకు కలుపుతూనే ఉండాలి. పంచదార పూర్తిగా కరిగి.. రవ్వకు పట్టుకున్న తర్వాత.. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. చివర్లో చిటికెడు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.

అలాగే మరో పావు కప్పు నెయ్యి చివర్లో వేయాలి. ఇలా చేయడం వల్ల హల్వ పొడిగా కాకుండా మెత్తగా, టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ ప్రసాదాన్ని కృష్ణాష్టమి రోజు చేసి.. కన్నయ్యకు నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు. ఈ నేతి హల్వా ఇంటిల్లీపాదికి నచ్చుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఇష్టంగా దీనిని తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ జన్మాష్టమికి మీరు కూడా ఈ టేస్టీ హల్వాను రెడీ చేసేయండి.