Kasarla Jalandhar Reddy: భార్య కోసం బిచ్చగాడిగా మారిన న్యాయవాది… హృదయాలను కదిలించే రియల్ లైఫ్ స్టోరీ…!

భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న న్యాయవాది
వేములవాడ రాజన్న సన్నిధిలో మొక్కు తీర్చుకుంటున్న భర్త
సంపాదన అంతా వైద్యానికి ఖర్చు చేసినా నయం కాని జబ్బు
ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ దేవుడిపైనే భారం వేసిన దంపతులు
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సినిమాలో తల్లి ఆరోగ్యం కోసం కోటీశ్వరుడైన కొడుకు బిచ్చగాడిగా మారితే, నిజ జీవితంలో ఓ భర్త తన భార్య ఆరోగ్యం కోసం యాచకుడిగా మారాడు. న్యాయవాది వృత్తిని సైతం పక్కనపెట్టి, వేములవాడ రాజన్న ఆలయం వద్ద భార్యతో కలిసి భిక్షాటన చేస్తున్న కాసర్ల జలంధర్ రెడ్డి కథ ఇది.


వివరాల్లోకి వెళితే, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జలందర్ రెడ్డికి, రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసాగర్‌కు చెందిన శిరీషతో 2006లో వివాహమైంది. కరీంనగర్‌లో జలందర్ రెడ్డి అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తుండగా, శిరీష ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అద్దె ఇంట్లో జీవనం సాగించేవారు. వారికి పిల్లలు లేరు.
కొంతకాలానికి శిరీష అనారోగ్యం బారిన పడ్డారు. ఆమె వైద్యం కోసం తమ సంపాదన మొత్తాన్ని ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో ఆర్థికంగా చితికిపోయారు. ఈ క్రమంలోనే, వేములవాడ రాజన్న సన్నిధిలో భిక్షాటన చేస్తే తన భార్య అనారోగ్యం నయమవుతుందనే బలమైన నమ్మకంతో జలంధర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆలయ ప్రాంగణంలోనే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

చిన్నపాటి మనస్పర్థలకే భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో, జబ్బుపడిన భార్య కోసం అన్నీ వదిలేసి, దేవుడి సన్నిధిలో భిక్షాటన చేస్తున్న భర్త కథ అందరినీ కదిలిస్తోంది. వారిద్దరి ప్రేమకు, నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.