మెగా ఫ్యామిలీ రచ్చ.. బన్నీపై నాగబాబు ఘాటు ట్వీట్

ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చుపెట్టాయి. గతంలో కూడా ఈ గొడవలు ఉన్నా ఈసారి అవి స్పష్టమైన విభజన రేఖను గీసేశాయి. అల్లు వారి ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య పొలిటికల్ గోడలు కట్టేశాయి. తాజాగా నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటు ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


“మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” అంటూ అల్లు అర్జున్ పేరెత్తకుండా అసలు విషయం చెప్పారు నాగబాబు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్లు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చిరంజీవి వీడియో సందేశం ఇవ్వగా, చివర్లో రామ్ చరణ్.. బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు. అయితే పవన్ కల్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేసి సరిపెట్టిన అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికోసం నంద్యాల రావడం సంచలనంగా మారింది. రావడమే కాదు, తన స్నేహితుడ్ని గెలిపించాలని కూడా బన్నీ ఓటర్లకు పిలుపునిచ్చారు. దీంతో బన్నీ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. జనసైనికులకు కోపం వచ్చింది.

అంతా అయిపోయాక.. అప్పటికప్పుడు అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీకి కోపం వచ్చినా బయటపడలేదు. ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత నాగబాబు తెలివిగా ట్వీట్ వేశారు. ముందుగానే ఈ కోపం ప్రదర్శిస్తే బన్నీ ఫ్యాన్స్ కూటమికి షాకిచ్చే ప్రమాదం ఉంది. అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత నర్మగర్భంగా ట్వీట్ వేసి బన్నీ ఫ్యాన్స్ కి మంట పెట్టారు నాగబాబు. ఇంకేముంది.. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ మొదలైంది. మెగా ఇమేజ్ నుంచి మెల్ల మెల్లగా పక్కకు వచ్చి తనకంటూ ఓ సొంత ఇమేజ్ సృష్టించుకుని ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. అందుకే ఆయన ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. నాగబాబు ట్వీట్ కి అల్లు అర్జున్ నేరుగా రియాక్ట్ అవుతారా, లేక ఫ్యాన్స్ సమాధానమే తన సమాధానం అంటూ సరిపెడతారా..? వేచి చూడాలి.