దేశవ్యాప్తంగా క్యాబ్, బైక్ ట్యాక్సీలను వినియోగించే వారికి కేంద్ర ప్రభుత్వం(Central Government) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్,ర్యాపిడో (Ola Uber Rapido) వంటి అగ్రిగేటర్ సర్వీసులపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రయాణికులకు భారం తగ్గించడమే కాక, కొన్ని వర్గాలకు ఊరట కలిగించేలా ఈ మార్పులు రూపొందించారు.కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదల చేసిన ‘మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025’ ప్రకారం, ఇప్పుడు పీక్ అవర్స్లో క్యాబ్ కంపెనీలు బేస్ ఫేర్పై రెట్టింపు వరకూ ఛార్జ్ వసూలు చేయొచ్చు. ఇప్పటివరకు ఇది కేవలం 1.5 రెట్లు మాత్రమే ఉండేది. అదే సమయంలో, రద్దీ లేని సమయాల్లో కనీస ఛార్జీ 50% కంటే తక్కువగా వసూలు చేయరాదని స్పష్టం చేశారు.
మినిమం ఫేర్ – కనీసం 3 కిలోమీటర్ల ప్రయాణం తప్పనిసరి
బేస్ ఫేర్ కింద ప్రయాణికులకు కనీసం 3 కిలోమీటర్ల దూరం కలిగించాల్సిందేనన్న నిబంధన కూడా ఉంది. దీని వల్ల తక్కువ దూరాల ప్రయాణానికి అధిక ఛార్జీలు వసూలు చేసే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది.రైడ్ బుక్ చేసి, అంగీకరించిన తర్వాత సరైన కారణం లేకుండా రద్దు చేస్తే జరిమానా తప్పదు. ఇది డ్రైవర్లకైనా, ప్రయాణికులకైనా వర్తించనుంది. మొత్తం ఛార్జీలో 10 శాతం లేదా గరిష్ఠంగా రూ. 100 వరకూ పెనాల్టీ విధిస్తారు.
డ్రైవర్లకు పెరిగిన వాటా – స్వంత వాహనదారులకు మంచి వార్త
ఓలా, ఊబర్లో పని చేసే డ్రైవర్లకు ఈ మార్గదర్శకాలు కొంత ఊరట కలిగిస్తున్నాయి. స్వంత వాహనం నడిపేవారికి మొత్తం ఛార్జీలో కనీసం 80 శాతం ఇవ్వాలని, కంపెనీకి చెందిన వాహనాలైతే 60 శాతం వాటా ఇవ్వాలని నిబంధనలో పేర్కొన్నారు.
బైక్ ట్యాక్సీలకు చట్టబద్ధత – ర్యాపిడోలకు ఊరట
ఇప్పటివరకు వివాదాల్లో ఉన్న బైక్ ట్యాక్సీలకు ఇప్పుడు చట్టబద్ధత లభించింది. ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఉన్న ద్విచక్ర వాహనాలనూ ప్రయాణికుల కోసం వాడేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో నిషేధం ఎదుర్కొంటున్న ర్యాపిడో, ఊబర్ మోటో సంస్థలకు దారులు తెరిచాయి.ఈ మార్గదర్శకాలను మూడు నెలల్లో అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికే క్యాబ్, బైక్ ట్యాక్సీ రంగం దీనిని హర్షంగా స్వీకరించింది.
































