సర్టిఫైడ్ కాపీతో సమస్య పరిష్కారం
గృహాలు, ఖాళీ స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు పోగొట్టుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారికంగా సర్టిఫైడ్ కాపీ(సీసీ)ని అందిస్తుంది.
ఈ ధ్రువీకరణ పొందిన దస్తావేజులకు ఒరిజినల్ పత్రాలతో సమానంగా గుర్తింపు ఉంటుంది. దీనిపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది మానసిక వేదనకు గురవుతుంటారు. అటువంటి కష్టాలు పడకుండా ఏం చేయాలో తెలుసుకోండి…
మూసాపేట, న్యూస్టుడే: ఏదైనా కారణంతో మన ఒరిజినల్ దస్తావేజులు పోయినప్పుడు.. సంబంధించిన నకలు పత్రాలు ఉన్నప్పటికీ వాటికి అధికారికంగా ధ్రువీకరణ ఉండదు. సదరు వ్యక్తి ఆస్తులను విక్రయించేటప్పుడు కొనుగోలుదారులు కూడా వాటిని విశ్వసించరు. ఏదైనా న్యాయపరమైన వివాదాలు తలెత్తినప్పుడూ నకలు పత్రాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవు. మన వద్ద ఒరిజినల్ పత్రాలు ఉన్నా.. సర్టిఫైడ్ కాపీలను మాత్రమే న్యాయస్థానాలకు సమర్పించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి దస్తావేజును స్కానింగ్ చేసి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లో భద్రపరుస్తారు. సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. వాటి నకలు పత్రాలను ఆ శాఖ ఆమోద ముద్రతో ధ్రువీకరిస్తుంది. దీంతో సదరు పత్రాలకు ఒరిజినల్ వాటికి సమానమైన గుర్తింపుతో పాటు చట్టబద్ధత కలుగుతుంది. దీన్నే రిజిస్ట్రేషన్ శాఖ పరిభాషలో సీసీ కాపీగా పేర్కొంటారు.
పొందండి ఇలా.. : ఒరిజినల్ దస్తావేజులకు ప్రత్యామ్నాయంగా సర్టిఫైడ్ కాపీని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. మీసేవా కేంద్రం లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా పొందే వీలుంది. మీ సేవలో రూ.510, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తుకు రూ.50 స్టాంపు పేపరును జతచేయాలి. ఆస్తికి సంబంధించిన దస్తావేజు సంఖ్య (డాక్యుమెంట్ నంబరు), రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం, హద్దులు, విస్తీర్ణంతో పాటు దరఖాస్తుదారుడి వివరాలు తెలపాల్సి ఉంటుంది. ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు సక్రమంగా లేకపోయినా.. డాక్యుమెంట్ నంబరు, రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన 24 గంటల్లో అధికారికంగా ధ్రువీకరించిన సర్టిఫైడ్ కాపీ అందజేస్తారు.
ఎఫ్ఐఆర్, సీసీ కాపీలతో విక్రయ హక్కులు..: సీసీ కాపీతో సదరు ఆస్తులను విక్రయించే అధికారం యజమానికి పూర్తిస్థాయిలో రాదు. కొందరు మోసగాళ్లు ఒరిజినల్ పత్రాలను తనఖా పెట్టి.. సీసీ కాపీతో ఆస్తులను విక్రయించే ప్రమాదం ఉంది. దీంతో పోలీసు ఎఫ్ఐఆర్ తప్పనిసరి చేశారు. ఒరిజినల్ దస్తావేజులు కోల్పోయిన వెంటనే మీ సేవా కేంద్రాల ద్వారా తమ ఆస్తి పత్రాలు ఎలా, ఎక్కడ పోయాయి? వంటి వివరాలను పోలీసు శాఖకు సమాచారం అందించాలి. నిర్ణీత రుసుం చెల్లించిన తర్వాత గడువులోపు ఆ విషయంపై పోలీసులు విచారణ చేసి ధ్రువీకరిస్తారు. అనంతరం మీ సేవా కేంద్రం ద్వారా పోలీసు ఎఫ్ఐఆర్ పత్రం ఇస్తారు. ఎఫ్ఐఆర్, సీసీ పత్రాలతో సదరు యజమాని ఆస్తులను విక్రయించే హక్కులు పొందుతారు.
నోట్: 2008 నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లకు మాత్రమే సర్టిఫైడ్ కాపీని మీ సేవ ద్వారా పొందే వీలుంది. అంతకంటే ముందు లావాదేవీలకు సంబంధించినవి కావాలంటే మాత్రం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి పొందాల్సి ఉంటుంది.