పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. చివరి రోజు సంచలన కామెంట్స్..

AB Venkateswara Rao Retirement: ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసేందుకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం(Andhra Pradesh Government) ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(Jawahar Reddy) ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, శుక్రవారం ఉదయమే ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇదే రోజున సాయంత్రం పదవీ విరమణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయనను విధుల్లోకి తిరిగి చేర్చిన ప్రభుత్వం.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ బాధ్యతలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని హోం సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ మేరకు జీఐడీ నుంచి జీవో నెంబర్ 1013ను ప్రభుత్వం జారీ చేసింది.


కొన్నేళ్లుగా ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. రిటైర్ అవ్వాల్సిన రోజున విధుల్లో చేరారు. ఉదయం బాధ్యతలు చేపట్టిన ఆయన సాయంత్రం పదవీ విరమణ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవీ విరమణ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. పోలీసు శాఖ పరంగా డీజీలో హోదాలో ఉన్నారు ఏబీవీ. కాగా, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఏబీవీని కలిసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏబీవీని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌మేట్స్ కావడంతో పరస్పరం క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు ఇరువురు అధికారులు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ఏబీవీ..

‘నేను ఇంజినీరింగ్ చదువుకుని తొలుత టాటామోటార్స్‌లో ఉద్యోగం చేశాను. అదే సంస్థలోలో ఉన్నా.. లేక అమెరికా వెళ్లినా.. ఇప్పుడు నా జీవితం వేరే విధంగా ఉండేది. ఐపీఎస్‌గా అధర్మాన్ని, అన్యాయాన్ని, అణచివేతను ఎదుర్కోవడం నా వృత్తిధర్మంగా పనిచేశాను. నా సర్వీసులో చట్టాన్ని కాపాడేండేందుకు అక్రమాలను, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు పాటుపడ్డాను. అన్యాయాన్ని ఎదుర్కొన్నా తప్పితే నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నేను ఈ రోజు పూర్తి సంతృప్తితో రిటైర్ అవుతున్నాను. నా సర్వీసులో నీతి నిజాయితీతో వ్యవహరించాను. ఎవరికీ అన్యాయం చేయకపోవడంతోనే ఈరోజు నేను లక్షల మంది అభిమానం పొందాను. నాకు ఎదురైన సవాళ్లు, కష్టాలు చూసి నా అభిమానులు ఉద్వేగ్వంతో ఏడ్చారు. నా నిజాయితీ, ధర్మం, పోరాటమే నన్ను కాపాడింది. నా సర్వీసులో దుర్మార్గులనూ చూశా.. నాకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కొందరు ఎంత డబ్బు ఇచ్చినా కొందరు అంగీకరించలేదు. నాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రిటైర్ అయినా నా జీవితం ఉన్నంతవరకు ప్రజా సేవలో ఉంటాను. నా శేష జీవితంలోనూ అన్యాయాన్ని, అణచివేతను ఎదురిస్తా. దుష్ట శిక్షణ-శిష్టరక్షణ చేసేందుకు నా రిటైర్డ్ జీవితంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. నాకు ఆప్తులుగా ఉండి అండగా ఉన్న వారికి రుణపడి ఉంటా’ అని అన్నారు.

ఉదయం మీడియాతో మాట్లాడుతూ..

ఉదయం విధుల్లో చేరే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తరువాత మళ్లీ విధుల్లోకి చేరడంపై సంతోషం వ్యక్తం చేశారాయన. రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీసులో చార్జ్ తీసుకుంటున్నానని, తనకు అభినందనలు తెలిపేందుకు వచ్విన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ‘ఈరోజు నా పదవీ విరమణ రోజు.. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా.. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి. విధుల్లో చేరాను. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. యూనిఫాంతో రిటైర్ కావడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నాను.’ అని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం కక్షపూరిత వైఖరి..

ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఫోకస్ పెట్టింది. ఆయనపై కక్షగట్టిన సర్కార్.. అకారణంగా ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అప్పడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని ఏపీ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా ఐదేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం ఫలించి.. పదవీ విరమణ రోజు విధుల్లో చేరారు. ఇప్పుడు పదవీ విరమణ పొందారు.