మంచు ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కన్నప్ప చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో భారీ స్టార్ క్యాస్టింగ్ భాగమైంది.
ఖర్చుకు వెనుకాడకుండా మోహన్ బాబు, మంచు విష్ణులు పక్కా ప్లానింగ్తో ఈ సినిమాను తీస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా కన్నప్ప సినిమాపై మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ ఇన్డైరెక్ట్ కామెంట్స్ చేశారు.
మహాభారత్ సిరీస్ తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో కన్నప్పను మంచు ఫ్యామిలీ నిర్మిస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు దేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన నటీనటులను ఇందులో భాగం చేస్తూ ప్లాన్డ్గా వెళ్తున్నాడు విష్ణు. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమాపై హైప్ తగ్గకుండా టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఊపు తెస్తోంది చిత్ర యూనిట్. అన్నింటిలోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో అనౌన్స్ చేసింది. దీంతో ప్రభాస్ పాత్ర ఏంటీ ? అంటూ డార్లింగ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్కు తెరదించుతూ ఇటీవల ప్రభాస్ లుక్ను రిలీజ్ చేశారు. కన్నప్పలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపిస్తున్నట్లు తెలిపారు.
ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే మంచు ఫ్యామిలీలో గొడవలు హాట్ టాపిక్గా మారాయి. ఆస్తి కోసం తండ్రీ కొడుకుల మధ్య వార్ నడుస్తోందని ఫిలింనగర్ టాక్. స్వయంగా తన తండ్రే తనపై దాడులు చేస్తున్నాడు, చేయిస్తున్నారు అంటూ మంచు మనోజ్ రోడ్డెక్కడం షాకింగ్ గా మారింది. మోహన్ బాబు కూడా మనోజ్పై రివర్స్లో కేసు పెట్టడంతో వీరి కాంట్రవర్సీ మాత్రం అంతకంతకూ హీట్ పెంచుతుంది. తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం కింద తనకు భద్రత కల్పించాలని మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను అభ్యర్ధించగా.. ఫిబ్రవరి 3వ తేదీన మోహన్ బాబు, మంచు మనోజ్లు కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇదిలాఉండగా.. రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటించిన జగన్నాథ్ మూవీ టీజర్ లాంచింగ్ ఈవెంట్ ఫిబ్రవరి 13న రాయచోటిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తొక్కుదామని చూస్తున్నారని.. తనను తొక్కాలన్నా, పైకి లేపాలన్నా అభిమానుల వల్లే అవుతుందన్నాడు. న్యాయం కోసం జరిగే పోరాటంలో ఎందాకైనా వెళ్తానని మంచు మనోజ్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో కన్నప్ప సినిమాపైనా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కోటి రూపాయలతో సినిమా తీస్తే అది చిన్న సినిమా కాదని, 1000 కోట్లతో తీస్తే అది పెద్ద సినిమా అయిపోదని.. సినిమా బాగుంటునే చూస్తారని మనోజ్ వ్యాఖ్యానించారు. తాను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా .. మంచు విష్ణు, మోహన్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.