ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఇటీవల ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించారు. కేవలం 48 గంటల్లో ఉత్తరప్రదేశ్ అంతటా నేరస్థులను ఎన్కౌంటర్ చేశారు.
ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కింద ఈ చర్య జరిగింది. నేరాలను తగ్గించడానికి, నేరస్థులను కఠినంగా శిక్షించడానికి ఈ ఆపరేషన్లు ప్రారంభించారు. మీరట్ నుంచి ముజఫర్నగర్ వరకు, పోలీసులు నేరస్థులను కాళ్ళపై కాల్చడం లేదా ఎన్కౌంటర్లో చంపేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కొనసాగుతున్నాయి. ఆపరేషన్ లాంగ్డా అంటే ఒక నేరస్థుడిని కాలిపై కాల్చి.. ఆపై అరెస్టు చేయడం. ఆపరేషన్ ఖల్లాస్ అంటే పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన నేరస్థుడికి ఎన్కౌంటర్ ద్వారా ఏకంగా యమరాజు వద్దకు పంపడం. నేరానికి ఏకైక శిక్ష ఎన్కౌంటర్ అని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఆపరేషన్లలో భాగంగా కేవలం 48 గంటల్లో, యూపీ పోలీసులు దాదాపు 20 ఎన్కౌంటర్లను నిర్వహించారు. ప్రతి నగరంలో ఎన్కౌంటర్లు జరిగాయి. మీరట్, ముజఫర్నగర్, ఫరూఖాబాద్, ఫిరోజాబాద్, మొరాదాబాద్, మధుర, హర్దోయ్, ఉన్నావ్, ఝాన్సీ, బులంద్షహర్, బాగ్పత్, బల్లియా, లక్నో, ఘజియాబాద్, షామ్లీ వంటి ప్రాంతాల్లో నేరస్థుల ఏరివేతలు జరిగాయి. మొదటి ఎన్కౌంటర్ ఫిరోజాబాద్లో జరిగింది. రూ. 2 కోట్లు దోచుకున్న పేరుమోసిన నేరస్థుడు నరేష్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. పరారీలో ఉన్న నేరస్థుడు నరేష్ను పట్టుకోవడానికి ASP అనుజ్ చౌదరి నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. మఖన్పూర్ ప్రాంతంలో నరేష్, పోలీసులు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ఆపరేషన్ ఖల్లాస్ ను అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.ఈ ఎన్కౌంటర్లో రామ్గఢ్ SO సంజీవ్ దూబే నేరస్థుల కాల్పుల్లో మరణించారు. గ్రామీణ ASP అనుజ్ చౌదరికి బుల్లెట్ తగిలింది. అదృష్టవశాత్తూ, బుల్లెట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో గుచ్చుకుంది. ఈ ఎన్కౌంటర్లో నేరస్థుడు నరేష్ ను చంపేశారు. అక్టోబర్ 5వ తేదీ రాత్రి, ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో పోలీసులు ఇమ్రాన్ అనే నేరస్థుడిని ఎన్కౌంటర్లో చంపారు. ఇమ్రాన్ తలపై ఇప్పటికే లక్ష రూపాయల రివార్డు ఉంది. 13 దోపిడీ కేసుల్లో నిందితుడు.
ముజఫర్నగర్లో పోలీసులు వరుసగా రెండు ఎన్కౌంటర్లు నిర్వహించారు. మొదట, లక్ష రూపాయల రివార్డు ఉన్న నేరస్థుడు మెహతాబ్ను పోలీసులు ఎన్కౌంటర్లో చంపారు. మెహతాబ్ 18 కి పైగా దోపిడీ కేసుల్లో వాంటెడ్గా ఉన్నాడు. లక్ష రూపాయల రివార్డును ప్రకటించిన మరో నేరస్థుడు నయీమ్ ఖురేషిని కూడా పోలీసులు చంపారు. ఖురేషి ఆరు హత్య, 20 దోపిడీ కేసుల్లో పరారీలో ఉన్నాడు. ఒకవైపు సీఎం యోగి ఆదేశాల మేరకు ఆపరేషన్ ఖల్లాస్ ప్రారంభించి నలుగురు కరుడుగట్టిన నేరస్థులను హతమార్చారు. మరోవైపు లక్నోలో జరిగిన ఎన్కౌంటర్లో అత్యాచార నిందితుడు హతమయ్యాడు. ఘజియాబాద్లో హత్య నిందితుడి కాలికి కాల్పులు జరిగాయి. షామ్లీలో ఒక ఆవు స్మగ్లర్ను కాల్చి చంపగా, ఝాన్సీలో వాంటెడ్ క్రిమినల్ను కాల్చి చంపారు. బులంద్షహర్లో జరిగిన ఎన్కౌంటర్లో అత్యాచార నిందితుడు మృతి చెందగా, బాగ్పత్లో దోపిడీ నిందితుడిని అరెస్టు చేశారు. జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుడిని బల్లియాలో దొంగతనం కేసులో నిందితుడిని ఆగ్రాలో, దోపిడీ నిందితుడిని జలౌన్లో ఎన్కౌంటర్ చేశారు. ఆపరేషన్ లాంగ్డా కింద.. మీరట్లో వస్త్ర వ్యాపారి ఆదిల్ను కాల్చి చంపి వీడియోను వైరల్ చేసిన నిందితుడు జుల్కమర్ను కూడా ఎన్కౌంటర్ చేశారు. గణాంకాల ప్రకారం.. 2017 నుంచి ఉత్తరప్రదేశ్లో పోలీసు ఎన్కౌంటర్లలో 239 మంది నేరస్థులు మరణించారు. ఇదే కాలంలో, 9,467 మంది నేరస్థులు గాయపడ్డారు. ఎన్కౌంటర్ల తర్వాత 30,694 మంది నేరస్థులను అరెస్టు చేశారు. గత ఎనిమిది సంవత్సరాలలో పోలీసులు, నేరస్థుల మధ్య 14,973 ఎన్కౌంటర్లు జరిగాయి. మీరట్ జోన్లో అత్యధిక సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగాయి.
































