నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డేటా ఇంజినీరింగ్‌లో 3 నెలలు ఉచిత శిక్షణ.. ఆపై జాబ్‌

డేటా ఇంజినీరింగ్‌లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. టాస్క్‌, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్‌ ప్రోగ్రాం ఉంటుందని పేర్కొన్నారు.


2021 నుంచి 2024 మధ్యల బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. మార్చి 1 లోపు అప్లై చేసుకోవాలన్నారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి నియామకాలు కల్పిస్తామని చెప్పారు.

శుక్రవారం నాడు ఈ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలను తెలుపుతూ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘నేటి డిజిటల్‌ యుగంలో డేటా ఇంజనీరింగ్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. డేటాను విశ్లేషించేందుకు స్కిల్స్‌ ఉన్న వ్యక్తుల పరిశ్రమలు అన్వేషిస్తున్నాయి. ఈ రంగంలోని ఉద్యోగ అవకాశాలను తెలంగాణ యువత అందిపుచ్చుకునేలా వారిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది’ అని ప్రకటనలో పేర్కొంది.

ఇంట్రెస్ట్‌ ఉన్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ కోసం https://task.telangana.gov.in/ ను విజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులో 25 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న అధ్యాపకుల పర్యవేక్షణలో 120 గంటల క్లాస్‌ రూం కోచింగ్‌, 360 గంటల పాటు ప్రాక్టికల్‌ శిక్షణ ఉంటుంది.