ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు దిశగా అడుగులు వేస్తోంది. సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకునే విధంగా ఐటీ ఎంప్లాయిస్ కోసం కొత్త పాలసీకి ఆమోద ముద్ర వేసింది.
ప్రతీ మండలంలో వర్క్ స్పేస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎవరికి ఈ వర్క్ స్పేస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి.. వాటిల్లో సౌకర్యాల పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి.
ఏపీ ప్రభుత్వం ఐటీ ఉద్యోగుల కోసం ప్రతీ మండలంలో వర్క్ స్పేస్ విధానం అమల్లోకి తెచ్చింది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు కొత్త పాలసీకి ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటు లోకి తెస్తూ.. ఉద్యోగం చేసుకోవటానికి వీలుగా సౌకర్యాలు కల్పిస్తారు. ఉద్యోగుల పని చేసే వాతావరణం కల్పిస్తూ వారి సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రతి మండలంలోనూ వర్క్స్పేస్ సదుపాయాన్ని కల్పించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం.
ఇలా వర్క్స్పేస్ సౌకర్యాలు కల్పించేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించిన ‘వర్క్స్పేస్’ పాలసీని మంత్రి మండలి ఆమోదించింది. ఎన్నికల సమయంలో సొంత ప్రాంతాల నుంచే వర్క్ చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇప్పుడు అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది.
ఇక, తాజా పాలసీ ప్రకారం మండల స్థాయిలో వర్క్స్పేస్ కోసం కనిష్ఠంగా 1000 చదరపు గజాల్లో 610 మంది పనిచేసేలా సదుపాయాలు ఉండాలని ఐటీ శాఖ పాలసీలో పొందుపరిచింది. వీటిల్లో వీడియో కాన్ఫరెన్స్లకు వీలుగా హైస్పీడ్ బ్రాడ్బాండ్ ఇంటర్నెట్ ఉండాలని, బిజినెస్ సమావేశా ల నిర్వహణ కోసం ప్రత్యేక గది, స్కానింగ్, ప్రింటింగ్, లాకర్ సదుపాయాలు ఉండాలని పేర్కొంది. రోజంతా విద్యుత్ సరఫరా ఉండాలని సూచించింది. విద్యార్థులు, నిపుణులకు డిజిటల్ స్కిల్స్ నేర్పేందుకు కావలసిన సదుపాయాలన్నీ ఉండాలని పేర్కొంది.
పాలసీలో భాగంగా మండలాల్లో ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటుచేసిన వర్క్ స్పేస్ లకు నామమాత్రపు అద్దెలో 100 శాతాన్ని ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటుచేసే వర్క్ స్పేస్ కు ఏటా రూ.6 లక్షలకు మించకుండా 50 శాతం అద్దెను భరిస్తుంది. ఎర్లీ బర్డ్ పాలసీ కింద ముందుగా వచ్చే వారికి పెట్టుబడి రాయితీ రూ.15 లక్షలకు మించకుండా 60 శాతం వరకూ ఇవ్వనుంది. హైస్పీడ్ బ్రాడ్బాండ్ కోసం 50 శాతం కనెక్షన్ చార్జీలను చెల్లించనుంది. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
































