వైసీపీ నేత సజ్జలకు షాక్, రేపు విచారణకు రావాలని పోలీసుల నోటీసులు

www.mannamweb.com


టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం మంగళగిరి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరారు. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం మంగిళగిరి పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులో సజ్జలకు తెలిపారు.

2021 అక్టోబర్ 19న వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ ఆఫీసులో వీరంగం సృష్టించారు. ఫర్మిచర్, కార్లు, అద్దాలు ధ్వంసం అక్కడి సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు వైసీపీ నేతలను ఇప్పటికే పోలీసులు విచారించారు. తాజాగా సజ్జలను విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు.
టీడీపీ ఆఫీసుపై దాడిలో సజ్జల ప్రమేయం

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జల ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే గుంటూరు ఎస్పీ లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఈ కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌లను ఇప్పటికే పోలీసులు విచారించారు. కేసు దర్యాప్తు ముగుస్తుండడంతో దాడిలో ప్రమేయం ఉన్న ముఖ్య నేతలను విచారించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై కేసులతో పాటు మరో రెండు కేసుల్ని సీఐడీకి బదిలీ చేశామని ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసు ఉందని నిన్న మీడియాతో అన్నారు. ఒక కేసు విషయంలో గుంటూరు జిల్లా ఎస్పీ లుకౌట్ నోటీస్ జారీ చేశారని పేర్కొ్న్నారు. ఆ కేసుకు సంబంధించి చట్టపరమైన తీసుకునే వీలుందన్నారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసును ఏపీ సర్కార్ సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును సాంకేతిక కారణాల నేపథ్యంలో ఇంకా మంగళగిరి పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం ఆరోపణలు ఉన్నాయి.
టీడీపీ ఆఫీసు దాడి కేసులో ట్విస్ట్

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడైన పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. 2021 అక్టోబర్‌లో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి చేసి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పార్టీ ఆఫీసులోని సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడికి పానుగంటి చైతన్య కీలకంగా వ్యవహరించాలని ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిన్న మంగళగిరి కోర్టులో లొంగిపోయారు.