AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది.


రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైకాపా ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత ఆయన క్యాట్‌ను ఆశ్రయించిగా.. సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా.. ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో సస్పెండ్‌ చేశారో.. తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్‌.. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని.. సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్యాట్‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. క్యాట్‌ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు నిరాకరించింది.