దేశంలో ప్రతిరోజూ రోడ్లపై వందలాది యాక్సిడెంట్లు(Road Accidents) జరుగుతుంటాయి. ముఖ్యంగా రాష్ట్ర రోడ్ల కంటే నేషనల్ హైవే(national-highways) లపైనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై నిర్దిష్ట ప్రాంతంలో ఏడాదికి ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్లకు భారీ జరిమానా విధించనుంది. బిల్డ్ -ఆపరేట్- ట్రాన్స్ఫర్ (BOT) విధానంలో నిర్మించే రోడ్లకు దీన్ని వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది.
ఇకనుంచి బీవోటీ విధానంలో నిర్మించే జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి వి.ఉమాశంకర్ తెలిపారు. హైవేలపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండే ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో సంవత్సరానికి ఒకటి కన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్కు రూ.25 లక్షల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు తర్వాతి ఏడాది అదే చోట మళ్లీ ప్రమాదం జరిగితే ఈ ఫైన్ రూ.50 లక్షలకు పెరుగుతుందని హెచ్చరించారు. మరోవైపు రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలో ప్రమాద ముప్పు ఉన్న ప్రాంతాలు 3500 వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు.
































