అమరావతే రాజధాని.. ఆర్థిక రాజధానిగా విశాఖ: చంద్రబాబు

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది.


అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారు. ఎన్నికల్లో 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగింది.

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం
మీ అందరి సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారు’’

రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది..
‘‘14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లాం. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది. సంక్షోభంలో ఉంది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి. రైతులు అప్పులపాలయ్యారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలి. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం’ అని చంద్రబాబు వెల్లడించారు.