పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని షురూ చేయనుంది. ఈ మేరకు ప్రాథమికంగా తేదీలను ఖరారు చేసింది. బుకింగ్స్ ఆధారంగా… జర్నీ ఉండనుంది. కృష్ణాలో వరద ఉద్ధృతి తగ్గటంతో ఈ ట్రిప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్య వివరాలు ఇక్కడ తెలుసుకోండి…
పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. సోమశిల – శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.ఇందుకోసం ఏర్పాట్లను సిద్ధం చేసింది. మరోవైపు టూరిస్టులు కూడా ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.
కృష్ణమ్మ ఒడిలో, నల్లమల పచ్చదనం అందాలను వీక్షిస్తూ కృష్ణా అలలపై జర్నీ కొనసాగుతుంది. ఈ అద్భుతమైన జర్నీ… కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేట్ చేయరు. అయితే ప్రస్తుతం వరద ఉద్ధృతి తగ్గటంతో… ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
సెప్టెంబర్ 16వ తేదీ నుంచి నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల నుంచి కృష్ణానదిలో శ్రీశైలానికి లాంచీ ప్రయాణాలు మొదలవుతాయి. ఇప్పటికే టూరిజం అధికారులు ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. దీనికోసం డబుల్ డెక్కర్ ఏసీ లాంచీలు, మినీలాంచీలు, స్పీడ్బోట్లను సిద్ధం చేశారు.
బుకింగ్ల ఎక్కువ ఉంటే ఈ నెల 18న, 20 తేదీల్లో కూడా ట్రిప్ అందుబాటులో ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణించేలా డబుల్ డెక్కర్ ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు.
ఈ జర్నీలో భాగంగా కొల్లాపూర్ మండలంలోని సోమశిల నుంచి శ్రీశైలం వెళ్తారు. కృష్ణా నదిలో సాగే జర్నీ… మాటల్లో వర్ణించలేం.సుమారు 120 కిలోమీటర్ల జలవిహారం ఉంటుంది. 6 నుంచి 7 గంటల పాటు సమయం పడుతుంది.
ఈ ప్యాకేజీలో పెద్దవారికి రూ.2 వేలు, చిన్నపిల్లలకు రూ.1,600 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు.లాంచీలో పర్యాటకులకు ఉదయం మరియు సాయంత్రం టీ, స్నాక్స్ మరియు లంచ్ అందిస్తారు. శ్రీశైలం నుంచి సోమశిలకు సైతం ఇవే ధరలు వర్తిస్తాయి.
ఉదయం 9 గంటలకు సోమశిల నుంచి లాంచీ బయలుదేరుతుంది. 7 గంటల ప్రయాణం అనంతరం పాతాళ గంగ ఏరియా కృష్ణగిరి (ఈగలపెంట) బోటింగ్ పాయింట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి వాహనాల్లో శ్రీశైలం వెళ్లాల్సి ఉంటుంది.
సోమశిల – శ్రీశైలం టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://tgtdc.in/home వెబ్ సైట్ ను సందర్శించాలి. సోమశిలలోని టూరిజం కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు. తెలంగాణ టూరిజం టోల్ ఫ్రీ నెంబర్ 180042546464 ను కూడా సంప్రదించవచ్చు.
































