ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తోంది. అందులో భాగంగానే మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో సహాయం అందించారు.
మొదటి విడతలో 24,000 రూపాయలు, రెండో విడతలో అదనంగా 6,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. అర్హులైన పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కాగా ఈ డబ్బుల్లో కేంద్రం 60 శాతం.. రాష్ట్రం 40 శాతం ఇస్తుంది.
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు తమ సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలి. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులు, CDPOల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సమర్పించాల్సిన పత్రాలు..
దరఖాస్తు సమయంలో అభ్యర్థులు కింది పత్రాలను అందజేయాలి:
జనన సర్టిఫికేట్
ఆదాయ ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం
సంరక్షకుల లేదా తల్లిదండ్రుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలు
బ్యాంక్ పాస్బుక్ కాపీ
మిగిలిన అవసరమైన ధ్రువీకరణ పత్రాలు
గమనిక: పత్రాలన్నీ తప్పనిసరిగా గెజిటెడ్ అధికారుల సంతకం కలిగి ఉండాలి.
ఇక ఈ పథకం కింద ఎంపికైన వారికి నెలకు రూ. 4,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ సాయం వారికి 18 ఏళ్ల వయస్సు వరకూ కొనసాగుతుంది.
అర్హత ప్రమాణాలు..
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు – 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయస్సు కలిగినవారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు.
జువెనైల్ జస్టిస్ చట్టం-2015 ప్రకారం నిరాదరణకు గురైన పిల్లలు.
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72 వేల లోపు, పట్టణాల్లో రూ. 96 వేల లోపు ఉండాలి.
































