ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన

www.mannamweb.com


రాష్ట్ర రాజధాని అమరావతికి (AP Capital Amaravati) రైల్వే ట్రాక్‌కు సంబంధించి ఏపీ ఎంపీలు కీలక ప్రకటన చేశారు. రాజధాని అమరావతిని కలుపుతూ త్వరలో రైల్వే ట్రాక్ రాబోతోందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Vijayawada MP Kesineni Chinni) వెల్లడించారు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌లో ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఆర్వోబీలు, ఆర్‌యూబీలు అభివృద్ధి చేయాలని కోరామని ఎంపీ కేశినేని నాని తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారన్నారు.

మరిన్ని కొత్త రైళ్లు, వందేభారత్ రైళ్లు కావాలని కోరామన్నారు. విజయవాడ నగరంలో డ్రైనేజి సమస్య రైల్వేతో ముడిపడి ఉందన్నారు. రైల్వే , రెవెన్యూ , మున్సిపల్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు జీఎం అంగీకరించారన్నారు. గత ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేసి ఉంటే విజయవాడకు వరద కష్టాలు ఉండేవి కావన్నారు. ఈ ఐదేళ్లలో రైల్వే పరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

ఆ స్టాపులను పునరుద్దరించాలని కోరాం: బాపట్ల ఎంపీ

రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కొత్త లైన్ రాబోతుందని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. రేపల్లె – బాపట్ల , మధ్య కొత్త లైన్ కావాలని కోరామన్నారు. విజయవాడ -గూడూరు మధ్య నాలుగో లైన్ ఏర్పాటు చేయాలని చేయాలని కోరామని.. అలాగే.. బాపట్ల, చీరాలలో వందే భారత్ రైలు స్టాప్ ఉండాలని కోరామని తెలిపారు. బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ కావాలని ప్రతిపాదన పెట్టామన్నారు. గతంలో నిలిపిన సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపులు పునరుద్ధరించాలని కోరామన్నారు. విజయవాడ డివిజన్‌లో 493 లొకేషన్లలో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ రావాల్సి ఉండగా … గత ప్రభుత్వంలో కేవలం 10 శాతమే కట్టారన్నారు. వెంటనే అన్నీ పూర్తి చేయాలని జీఎంను ఎంపీలంతా కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. పలు రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు పెంచాలని ఎంపీలంతా కోరారని అన్నారు. రైళ్లు ఢీ కొనకుండా కవచ్‌ను అన్ని రైళ్లలో ప్రవేశపెడుతున్నట్లు ఎంపీ తేన్నెటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. కొత్త రైల్వే లైన్లు,కొత్త రైళ్లు మంజూరు చేయాలని ఎంపీలు జీఎంను కోరారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. అవసరమైన చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఒవర్ బ్రిడ్జీలు నిర్మించాలని ఎంపీలు కోరారన్నారు. కర్నూలులో రైల్వే వర్క్ షాప్‌ను అభివృద్ధి చేయాలని జీఎంను కోరినట్లు ఎంపీ తెలిపారు.

పాసింజర్ రైళ్లను పెంచాలని కోరాం: ఎంపీ లక్ష్మినారాయణ

రాష్ట్రంలో రైల్వే సమస్యలు వేగంగా పరిష్కరించాలని జీఎంను కోరగా సానుకూలంగా స్పందించారు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ అన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరామని తెలిపారు. విజయవాడ – బెంగళూరు మధ్య తిరిగే కొండవీడు ఎక్స్ ప్రెస్‌ను రోజూ నడపాలని కోరామన్నారు. అలాగే బెంగళూరు – పుట్టపర్తికి నడిచే ఎక్స్‌ప్రెస్‌ను అనంతపురంకు పొడిగించాలని కోరామన్నారు. ప్రయాణికుల దృష్ట్యా ప్యాసింజర్ రైళ్లను పెంచాలని కోరామని. రైళ్లలో వృద్దులకు రాయితీ పునరుద్ధరించాలని కోరినట్లు ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ వెల్లడించారు.