AP Election 2024: ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పిన కేటీఆర్

హైదరాబాద్: చెదురమదురు హింసాత్మక ఘటనల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గత సోమవారం ముగిశాయి. ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు ఇటు కూటమి పార్టీలు కూడా దీమా ఉన్నాయి.


ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తున్నాడని సమాచారం ఉందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ఏపీ ఎన్నికలపై మీడియా ప్రతినిధులు స్పందించగా ఈ విధంగా స్పందించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు ఒక్క ఎంపీ సీటే: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. అది కూడా కేవలం నల్గొండ ఎంపీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థులతో తాను మాట్లాడానని, ఎలక్షన్ చక్కగా జరిగిందని అన్నారు. తాను ప్రత్యేకంగా సర్వే కూడా చేయించానని, ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్‌కు పడినట్టుగా సర్వే రిపోర్ట్ చెబుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు కరెక్ట్‌గా లేరని అన్నారు. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కగా గెలుస్తున్నామని దీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉందని అన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్‌ను చూసి కాంగ్రెస్ , బీజేపీ భయపడ్డాయని కేటీఆర్ అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లాభం జరిగే అవకాశం ఉందని అన్నారు.

సిరిసిల్లలో నేను ఒక్క రూపాయి పంచలేదు: కేటీఆర్

పెద్దపల్లిలో వివేక్ పైసలు చల్లి ప్రచారం చేశారని కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదని అన్నారు. ”కావాలంటే మీరు వెళ్లి సిరిసిల్లలో ఓటర్లను మైకులు పెట్టి అడగండి. సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్‌గిరికి ఏమన్నా సంబంధం ఉందాఝ? ఆమె అక్కడ కాంగ్రెస్ కాండేట్ ఏంది?. బండి సంజయ్‌ని గెలిపించాలని అడ్రస్ లేనివారికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ… వెలిచాల రాజేశ్వరరావు ఎవరు?. నాగర్ కర్నూల్‌లో మా అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి మిగతా ఇద్దరు అభ్యర్థులు సరితూగలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటన తర్వాత పూర్తిగా సమీకరణాలు మారిపోయాయి. ఖమ్మంలో నామా నాగేశ్వర్ రావుని కమ్మ సామాజికవర్గం గెలిపించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం చూపిస్తోందని అనుకోవడం లేదు. జూన్ 4న తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరే చూడండి” అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.