ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్‌ న్యూస్.. ఇకపై బియ్యంతో పాటు చిరు ధాన్యాల పంపిణీ

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు సర్కార్ మరో గుడ్‌ న్యూస్ చెప్పబోతోంది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు చిరు ధాన్యాలు సరఫరా చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.


ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్ చెప్పబోతోంది. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు చిరు ధాన్యాలు సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే చిరు ధాన్యాల సరఫరాపై గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులతో ఆయన చర్చించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులందరికి సబ్సిడీ రేట్లలో పప్పు ధాన్యాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రజలకు అవసరమైన పోషకాహారాన్ని సరసమైన ధరలలో అందుబాటులోకి తీసుకు రావడం, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. త్వరలోనే రేషన్ షాపుల ద్వారా చిరు ధాన్యాలు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతన్నాయని, ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలు, హాస్టల్లకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.