దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. సముద్రమట్టం నుంచి 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల చక్రవత ఆవర్తనం ఏర్పడింది. ఇక ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తదుపరి 24 గంటలలో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా మారుతుందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి.
ఆదిలాబాద్లో 13.2 డిగ్రీలు, మెదక్లో 14 డిగ్రీలు, పటాన్ చెరువులో 15.4 డిగ్రీలు, హయత్ నగర్లో 16.6 డిగ్రీలు, రామగుండంలో 17.3 డిగ్రీలు, నల్లగొండలో 17.4 డిగ్రీలు, హనుమకొండలో 18 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 18 డిగ్రీలు, దుండిగల్లో 18.1 డిగ్రీలు, నిజామాబాద్లో 18.4 డిగ్రీలు, హైదరాబాద్లో 19.4 డిగ్రీలు, హకింపేట్లో 19.9 డిగ్రీలు, మహబూబ్నగర్లో 20.6 డిగ్రీలు, ఖమ్మంలో 21.2 డిగ్రీలు, భద్రాచలంలో 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మరే అవకాశం ఉందని అంచనా వేసింది. మంగళవారం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక వద్ద మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించింది.



































