AP News: బొత్సకు డబ్బులిచ్చాం.. అయినా బదిలీ కాలేదు!

లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు
ఎన్నికల ముందు బదిలీల పేరిట రూ.50 కోట్లు వసూలు చేసిన మంత్రి బొత్స, ఆయన పేషీ అధికారులు
సిఫార్సు బదిలీలు నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
ఎన్నికల కోడ్‌ తర్వాత కొత్త పాఠశాలల్లో చేరకుండా నిలిపివేత
విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి


ఎన్నికల ముందు రూ.కోట్లు దండుకొని మంత్రి బొత్స సత్యనారాయణ, కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. వైకాపా ఎమ్మెల్యేలు, నాయకుల సిఫార్సులతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకొని మంత్రి, ఆయన పేషీలో పనిచేసే పీఏ, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, సచివాలయంలోని కొందరు అధికారులు కలిసి ఎన్నికల ముందు హడావుడిగా బదిలీలు చేశారు. వీటిపై అప్పట్లోనే అనేక ఆరోపణలొచ్చాయి. బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖలోని కీలక అధికారి సహకారం అందించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడంతో ఆ సంవత్సరం ముగింపు రోజున పాత పాఠశాలలో రిలీవ్‌ అయి, కొత్త బడుల్లో చేరాలని మొదట ఆదేశాలిచ్చారు. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో కోడ్‌ ముగిసిన తర్వాత కొత్త పాఠశాలల్లో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్‌ గురువారంతో ముగియడంతో ఉపాధ్యాయులు కొత్త బడుల్లో చేరే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

డబ్బులు పోయే.. బదిలీ ఆగిపోయే!
రాజకీయ సిఫార్సు బదిలీలకు ఒక్కో ఉపాధ్యాయుడు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు పెట్టారు. వివిధ కారణాలతో పట్టణాలు, నగరాలకు సమీపంలోకి వచ్చేందుకు ఈ బదిలీలను ఆశ్రయించారు. మంత్రి, ఆయన పేషీలోని పీఏ, కొందరు అధికారులు కలిసి దాదాపు రూ.50 కోట్లు ఈ బదిలీల్లో దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. బదిలీలు నిలిచిపోవడంతో డబ్బులూ పోయాయి.. బదిలీలు ఆగిపోయాయని బాధిత ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది వరకు ఉపాధ్యాయులు బదిలీల కోసం డబ్బులు చెల్లించినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో 1,400 మందికి మాత్రమే బదిలీలు చేశారు. వీరిలోనూ కొందరికి పోస్టులు లేకుండా పోయాయి. డబ్బులు ఇచ్చినా బదిలీలు కాని కొందరు ఉపాధ్యాయులు శుక్రవారం విజయవాడలో ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు బాధిత ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రకటన విడుదల చేశారు.

రెండు శాఖలను కలిపి కూర్చోబెట్టి..
సిఫార్సు బదిలీలను హడావుడిగా పూర్తి చేసేందుకు ఒక కీలక అధికారి ఏకంగా కమిషనరేట్‌లో పని చేసే అధికారులు, సిబ్బందిని, సచివాలయంలో పని చేసే అధికారులను ఒకేచోట కూర్చోబెట్టారు. కమిషనరేట్‌ నుంచి సచివాలయానికి దస్త్రాలు, జాబితాలు వెళ్లి, మళ్లీ తిరిగి రావడం, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించడంలాంటివి ఆలస్యమవుతున్నాయంటూ అందర్నీ ఒకేచోట కూర్చోబెట్టి ఈ సిఫార్సు బదిలీలను చేయించారు. మొదట్లో బదిలీ చేసిన కొంతమందికి జీతాలు రాకపోవడంతో ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ఏప్రిల్‌ 23న ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ బదిలీలను ర్యాటిఫై చేస్తూ ఆదేశాలిచ్చారు. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన కీలక అధికారి.. రెండు విభాగాలకు చెందిన అధికారులను ఒకేచోట కూర్చోబెట్టి బదిలీలు చేయించడం అవినీతికి పరాకాష్ఠ. ఇంతా చేస్తే ఈ బదిలీలకు అడ్డుకట్ట పడింది. మంత్రి, ఆయన పీఏ, కొందరు అధికారులు, వైకాపా నేతలు ఈ బదిలీలతో భారీగా లబ్ధి పొందగా.. డబ్బులిచ్చిన ఉపాధ్యాయులు బాధితులుగా మిగిలారు. డబ్బులు పోయాయి.. బదిలీలూ కాలేదని ఆవేదన చెందుతున్నారు. కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినా బదిలీ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఇలాంటివారు వందల్లో ఉన్నారు. వీరు తమ డబ్బులు వెనక్కి ఇప్పించాలని కోరుతున్నారు.

ఒక్కోసారి ఒక్కో విధానంతో దందా

బదిలీలకు ప్రతిసారీ కొత్త విధానాన్ని తీసుకురావడం మంత్రి, ఆయన పేషీకి తెలిసినట్లు మరెవరికీ తెలియకపోవచ్చు. ఒక్కోసారి ఒక్కో విధానం అంటూ భారీగా డబ్బు గుంజేశారు. సాధారణ బదిలీలు గతేడాది జూన్‌తో ముగిశాయి. జులైలో అనధికారికంగా కొన్ని సిఫార్సు బదిలీలు చేశారు. వీటికీ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయినా దాహం తీరని ప్రజాప్రతినిధి మరో విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఈసారి ఉపాధ్యాయినులకే బదిలీలంటూ సిఫార్సులకు అనుమతించారు. ఈ సమయంలోనూ మరోసారి డబ్బులు నొక్కేశారు. ఈ సమయంలో 600 వరకు బదిలీలు చేశారు. టీచర్ల బదిలీల్లో ప్రాంతాలు, హెచ్‌ఆర్‌ఏ ఆధారంగా అన్ని స్థాయిల్లో కలిపి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారు. బదిలీ కావాలంటే ముందుగా వైకాపా నాయకుడు, ప్రజాప్రతినిధి నుంచి లేఖ కావాలనే అనధికారిక నిబంధన పెట్టారు. కొందరు వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖ ఇచ్చేందుకే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు గుంజేశారు. బదిలీ దరఖాస్తులతోపాటు వైకాపా నేతల లేఖలు ఇచ్చాక.. మంత్రి వద్ద పని చేసే పీఏ నేరుగా మామూళ్లు వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ పీఏ సిఫార్సు చేసిన జాబితాకే ఉన్నతాధికారి ఆమోదముద్ర వేశారు.