ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు విస్తారంగా వర్షాలే వర్షాలు

www.mannamweb.com


వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్నాడు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. దీంతో ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

లేటెస్ట్‌గా వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు బెంబేలెత్తిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ తీవ్ర తుపానుగా మారి, చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత తప్పదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇక ఇప్పటికే ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మోస్తరు వర్షాలు కాస్తా.. కుండపోతగా మారుతాయని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తోంది.

ఇటు తమిళనాడులోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టుతోపాటు మొత్తం 10 జిల్లాలకు ఆరెంజ్​అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో వారం రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలతో పాటు కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో.. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే.. బెంగళూరు వ్యాప్తంగా వానలు దంచికొడుతుండగా.. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరులోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కర్నాటక ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే.. ఉద్యోగులు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించింది. మొత్తంగా.. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుండగా.. అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో కుంభవృష్టి ఖాయమన్న సంకేతాలిస్తోంది వాతావరణశాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.