Credit Cards: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? ఫ్లైట్ టిక్కెట్‌ ఉచితంగా పొందండిలా..!

ప్రస్తుతం అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు సులభంగా క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఆదాయం, ఖర్చులు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా వీటిని కస్టమర్లకు జారీ చేస్తారు.
అయితే క్రెడిట్ కార్డులను ఎక్కువగా యూజ్ చేసే వారికి రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. వీటిని ప్రయాణాల్లో యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్లైట్లలో లగ్జరీ బిజినెస్ క్లాస్ జర్నీకి ఈ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు. ఈ హాలిడేస్ సీజన్‌లో కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేవారికి ఇవి డబ్బును భారీగా ఆదా చేస్తాయి.


ప్రస్తుతం ట్రావెలింగ్ ఖర్చులు పెరిగాయి. కుటుంబంతో కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణాలు చేసేవారికి ఈ భారం మరింత పెరిగింది. అయితే ట్రావెలింగ్ కాస్ట్‌ను తగ్గించుకునే మార్గాలు ఉన్నాయంటున్నారు అమెరికాకు చెందిన జిమ్మీ, పౌలిన్. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో వీరు తమ ట్రావెల్ డైరీని పంచుకుంటూ, నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ట్రావెలింగ్ కాస్ట్‌ను ఎలా తగ్గించుకోవచ్చో వీరు సలహాలు, సూచనలు ఇస్తూ ఇంటర్నెట్లో పాపులర్ అయ్యారు.
ఖర్చులను తగ్గించే మార్గం

న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం, జిమ్మీ మిచెల్ మాట్లాడుతూ బిజినెస్ క్లాస్ ట్రావెలింగ్ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో వివరించారు. ఫ్లైట్ సీటు కోసం తాము డబ్బు చెల్లించమని, అందుకు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను ఉపయోగిస్తామని జిమ్మీ చెప్పారు. క్రెడిట్ కార్డుల నుంచి పాయింట్లను పొందడానికి ‘పాయింట్ హ్యాకింగ్’ ఉత్తమ మార్గం అని అతడు చెప్పాడు. పాయింట్ హ్యాకింగ్ అనేది.. ఫ్లయర్ పాయింట్లను రిడీమ్ చేయడం, ఆ పాయింట్లను లగ్జరీ ఫ్లైట్ జర్నీల కోసం వినియోగించడం. వ్యక్తులు ట్రావెలింగ్ కోసం చేసే ఖర్చులను ఇలా కవర్ చేసుకొని లబ్ధి పొందుతారు.

మంచి ప్లాన్

“ఒక క్రెడిట్ కార్డుతో $3000 ఖర్చు చేస్తే, కంపెనీ సగటున 1,00,000 రివార్డు పాయింట్లను అందించవచ్చు. అందుకే మీరు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి, లిమిట్‌కు తగ్గట్లు ఖర్చు చేయండి. తర్వాత లక్ష పాయింట్లను పొందండి. ఈ రివార్డు పాయింట్లతో మీరు పెర్త్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు బిజినెస్ క్లాస్ టిక్కెట్‌ ఉచితంగా పొందవచ్చు. కొంతమంది వ్యక్తులు 10-12 క్రెడిట్ కార్డులను వాడతారు. రివార్డు పాయింట్లను పొందడానికి, వాటితో ప్రయోజనం పొందడానికి మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. అంతకు మించి క్రెడిట్ కార్డులను ఉపయోగించరు.” అని జిమ్మీ టిక్‌టాక్ వీడియోలో చెప్పారు.

ఇది నిజమేనా?

అయితే జిమ్మీ చెప్పినది నిజమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దానికి ఒక టిక్‌టాక్ యూజర్ సమాధానమిచ్చారు. అతడు ‘పాయింట్ హ్యాకింగ్’ గురించి మాట్లాడాడు. బ్యాంకులు, కార్డ్ కంపెనీలు తమ క్రెడిట్ కార్డుల కోసం పాయింట్లను అందిస్తాయి. వెలాసిటీ కంపెనీ 1,20,000 పాయింట్ల వరకు అందిస్తుందని సదరు నెటిజన్ చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. అయితే ముందు పాయింట్ హ్యాకింగ్‌ లాభనష్టాలను తెలుసుకోవాలని, తర్వాత వాటి వినియోగంపై దృష్టి పెట్టాలని ఆ వ్యక్తి సలహా ఇచ్చాడు.