పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు.. . కత్తులు, బ్లేడ్లతో రక్తం చిందిస్తూ సంతాపం

హైదరాబాద్ పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు మొదలైంది. భారీ సంఖ్యలో షియా ముస్లిం సోదరులు… కత్తులు, బ్లేడ్లతో తమ శరీరాన్ని గాయపరుచుకుని రక్తాన్ని చిందిస్తూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.


మొహర్రం సంతాప దినంలో భాగంగా డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం నుంచి అంబారిపై ఊరేగింపుగా తీసుకెళ్తూ, చార్మినార్, పతర్‌గట్టి, మదినా ప్రాంతాల మీదుగా ఊరేగింపు కొనసాగుతోంది. మొహమ్మద్ ప్రవక్త మనవడు హుసైన్ ఆత్మ త్యాగానికి గుర్తుగా జరుపుకునే మొహరంను పురస్కరించుకుని, హైదరాబాద్ పాతబస్తీ డబీర్‌పురా ప్రాంతంలో బీబీ కా అలావాలో సంతాప దినాలు నేటి ఊరేగింపుతో ముగియనున్నాయి.

చార్మినార్ వద్ద బీబీ-కా-ఆలం చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. డబీర్​పురాలోని బీబీ-కా-ఆలం నుంచి మొదలైన ఊరేగింపు.. అలీజ కోట్ల, చార్మినార్‌, గుల్జార్​హౌజ్‌, పంజేశా, మీర్‌ఆలం మండి, దారుల్‌ శిఫ మీదుగా వెళ్లి చాదర్‌ఘాట్‌ వద్ద ముగుస్తుంది. మరోవైపు ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సౌత్‌ జోన్‌ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంబారి చుట్టూ సౌత్ జోన్ పోలీస్ స్పెషల్ టీం మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసి, ఊరేగింపును సజావుగా కొనసాగిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు చార్మినార్ వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.