నిత్యం ఒక చోటు నుంచి మరో చోటు నిమిషాల్లో గమ్యస్థానాలకు చేరేందుకు క్యాబ్ బుక్ చేసుకునే వారి సంఖ్య వేలల్లోనే ఉంటారు. షేర్ ఆటోలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉన్నప్పటికీ అందిక మంది కంఫర్ట్ కోసం క్యాబ్స్లో జర్నీ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వీటిని నడిపే క్యాబ్ డ్రైవర్లు మాత్రం తమ కష్టానికి తగ్గ ఫలితం నోచుకోవట్లేదు..
రాష్ట్ర రాజధాని నగరంలో క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లు మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి రైడ్స్ నిషేధించిన చేసిన క్యాబ్ డ్రైవర్లు, ఇప్పుడు మరో నిరసనకు దిగారు. ఇకపై క్యాబ్లలో ఏసీ సదుపాయం కల్పించబోమని వెల్లడించారు. ఈ మేరకు మార్చి 24 నుంచి ‘నో ఏసీ క్యాంపెయిన్’ పేరిట ఎయిర్ కండిషన్డ్ (AC) రైడ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రీ-పెయిడ్ టాక్సీ ఛార్జీల మాదిరిగానే ఏకరీతి రైడ్-ఫేర్ నిర్మాణాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) డిమాండ్ చేస్తోంది. క్యాబ్ అగ్రిగేటర్ల అన్యాయమైన ధరలు నిలిపివేయాలని, ఇంధనం, నిర్వహణ ఖర్చును, డ్రైవర్ల సేవలకు న్యాయమైన పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నారు.
గతేడాది ఏప్రిల్లో క్యాబ్ డ్రైవర్ల సంఘం ఇదే మాదిరి ‘నో ఏసీ ప్రచారాన్ని’ నిర్వహించింది. డ్రైవర్లు కిలోమీటరుకు రూ.10 నుంచి 12 సంపాదిస్తారని, అయితే ఏసీ ఆన్లో ఉంచి క్యాబ్ నడపడానికి అయ్యే ఖర్చు కిలోమీటరుకు రూ.16-18గా పేర్కొంది.’నో ఏసీ ప్రచారం’ సహా వివిధ మార్గాల ద్వారా క్యాబ్ అగ్రిగేటర్లు అన్యాయంగా ధరలు నిర్ణయించడాన్ని నిరసిస్తూ TGPWU అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ప్రకటించారు. క్యాబ్ అగ్రిగేటర్లు, ప్రీ-పెయిడ్ టాక్సీలు వసూలు చేసే రైడ్-ఛార్జీలలో గణనీయమైన వ్యత్యాసం ఉందని, సుమారు రూ.300-400 తేడా ఉందని ఆయన అన్నారు. ఈ వ్యత్యాసం ఎయిర్పోర్టులలో ఎక్కువసేపు వేచి ఉండే సమయం, తిరుగు ప్రయాణానికి అయ్యే మొత్తం 3-4 గంటల సమయం, అగ్రిగేటర్లకు చెల్లించే భారీ 30 శాతం కమీషన్తో కలిపి క్యాబ్ డ్రైవర్లకు తక్కువ ఆదాయాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు. ‘నో ఏసీ’ ప్రచారం తర్వాత చాలా మంది ఓలా, ఉబర్, రాపిడో వంటి ఇతర యాప్-క్యాబ్ డ్రైవర్లు కూడా తమ వాహనాలను రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA)కి అప్పగించాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో వేసవి కాలం నడుస్తుంది. మార్చి 23 నుంచి ప్రకారం ఉష్ణోగ్రతలు 22.73°C, 33.28°C మధ్య హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గినా.. వచ్చేవారం నుంచి దిమ్మతిరిగే స్థాయిలో ఎండలు ఊపందుకుంటాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో మార్చి 24 నుంచి క్యాబ్ డ్రైవర్లు.. కార్లలో ఏసీలను వేయడం మానేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో హైదరబాదీలు ఇక్కట్లు పడే అవకాశం ఉంది.