కనులపండువగా.. బ్రహ్మాండ నాయకుడి బ్రహోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

www.mannamweb.com


తిరుమల శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్యలో మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరగ్గా ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు వెంకన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

రాత్రి 7.55 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం చేరుకున్న చంద్రబాబు, 14వ సారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు గా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలను సీఎం కు ఈఓ అందజేశారు. సిఎం వెంట రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.