కవితను అరెస్ట్ చేసిన సీబీఐ: బిగుసుకున్న ఉచ్చు ..

Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగనున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. తాజాగా ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైలులోనే ఈ విచారణ కొనసాగింది. అక్కడే ఆమెను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.


కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందటే సీబీఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సానుకూలంగా స్పందించింది ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం. విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుంచి సరైన, సంతృప్తికర సమాధానం లభించకపోవడం వల్లే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మద్యం పాలసీ కేసులో కిందటి నెల 15వ తేదీన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపర్చాగా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తులు. మూడుసార్లు ఆమె కస్టడీని పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను సేకరిస్తోన్నామని, ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి వివరించారు ఈడీ అధికారులు. ఇదే కేసులో సీబీఐ సైతం కవిత కస్టడీని కోరుతూ పిటీషన్ దాఖలు చేసిందని ఈడీ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సమాజంలో పలుకుబడి ఉన్న నాయకురాలు కావడం వల్ల కవితకు బెయిల్ మంజూరు చేస్తే- సాక్ష్యులను ప్రభావితం చేయగలరని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. అందుకే మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ కావాలని కోరారు.