Amaravati: ఇక అమరావతి కళకళ!

వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి.. కూటమి గెలుపుతో కొత్త కళ సంతరించుకోనుంది. రాష్ట్రంలో ఎన్డీయే గెలుపు, అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో సీఆర్డీఏ ఆఘమేఘాలపై పనులు ప్రారంభించింది.


ప్రమాణ స్వీకారంలోపు జంగిల్‌ క్లియరెన్స్‌ పూర్తి
109 కి.మీ.పరిధిలో 673 ఎకరాల్లో ముమ్మరంగా పనులు
కొలిక్కివచ్చిన విద్యుద్దీపాల ఏర్పాటు

ఎన్జీవో భవనాల చుట్టూ ఉన్న ముళ్ల కంపలను జేసీబీలతో తొలగిస్తున్న సీఆర్డీఎ సిబ్బంది

ఈనాడు, అమరావతి: వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి.. కూటమి గెలుపుతో కొత్త కళ సంతరించుకోనుంది. రాష్ట్రంలో ఎన్డీయే గెలుపు, అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో సీఆర్డీఏ ఆఘమేఘాలపై పనులు ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ (ముళ్ల కంపల తొలగింపు) పనులు మూడు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 ప్రాంతాల్లో 94 పొక్లయిన్లతో 109 కి.మీ.నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

నిలిచిన నిర్మాణాలపై పరిశీలనకు కమిటీ

తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలను వైకాపా ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్మాణాల పటిష్టత ఏ స్థాయిలో ఉందో తేల్చేందుకు ఇంజినీరింగ్‌ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత పనులు చేపడతారు.


మట్టిలో కూరుకుపోయిన భారీ పైపులను బయటకు తీసి..

కరకట్ట, సీడ్‌ యాక్సెస్‌ రోడ్లపై విద్యుత్‌ కాంతులు

కరకట్టపై వెలగని విద్యుద్దీపాలను సీఆర్డీఏ సిబ్బంది మారుస్తున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలను, మిగిలిన రోడ్లపై మరో 55 లైట్లను మార్చారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రెండు దశల్లో రూ.9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్‌ లైటింగ్‌ ప్రాజెక్టును కూడా తాజాగా పూర్తి చేశారు. వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు మొత్తం 9 కి.మీ. మేర ఈ మార్గంలో  వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. ఇవి ముళ్ల పొదలతో నిండిపోయాయి. వీటిని శుభ్రం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఎన్జీఓ అపార్ట్‌మెంట్లు, విట్‌ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గం, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయం, నవులూరులోని ఎంఐజీ లేఔట్, స్టేడియం, శాఖమూరు పార్కు, ఎన్‌ఐడీకి వెళ్లే మార్గాల్లో ముళ్లచెట్లను కూడా తొలగిస్తున్నారు.


ఇన్నాళ్లూ కంపచెట్లతో కనిపించని భూగర్భ డ్రైనేజి కట్టడాలు మొక్కలను తొలగించాక బయట పడ్డాయిలా..