‘ట్రూ కాలర్’ వంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండానే మోసపూరిత, అవాంఛిత (స్పామ్) కాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ నడుం బిగించింది. ట్రాయ్ తీసుకున్న చర్యలతో ఇకపై ఆయా టెలికం సంస్థలే కాలర్ ఐడీ సేవలను తీసుకురానున్నాయి. అంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు ఎలాంటి యాప్ సాయం లేకుండానే స్క్రీన్పై కాలర్ పేరు కనిపిస్తుంది. ఇందుకోసం జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా హెచ్పీ, డెల్, ఎరిక్సన్, నోకియా వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నాయి.
దశల వారీగా ఈ సేవలు అందుబాటులోకి రానుండగా, తొలుత ఏ నెట్వర్క్ యూజర్కు అదే నెట్వర్క్ నుంచి వచ్చే కాల్స్కు మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో యూజర్కు ఎయిర్టెల్ నుంచి కానీ, వొడాఫోన్ నుంచి కానీ వచ్చే కాల్స్కు ఇది వర్తించదు. అయితే, టెలికం కంపెనీలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు అంగీకరిస్తే అప్పుడు ఏ నెట్వర్క్ నుంచి ఎవరు ఫోన్ చేసినా కాలర్ ఐడీ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే స్పామ్ కాల్స్కు చెక్ పడినట్టే.