ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు భారీ వరం ప్రకటించే అవకాశం ఉంది.
ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక విషయంపై సానుకూలంగా స్పందించారు. పీఆర్టీయూ నాయకులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు వేతన సవరణ సంఘం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని పీఆర్టీయూ నాయకులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని పీఆర్టీయూ నాయకులు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబు పీఆర్టీయూ 2026 డైరీని, క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో టీచర్స్ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గిరిప్రసాద్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై సీఎంతో పీఆర్టీయూ నాయకులు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పీఆర్టీయూ నాయకులు మాట్లాడారు. నూతన జిల్లాల ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడంతో ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటుకు త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎంతో కాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న ఉమ్మడి సర్వీసు రూల్స్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్సీ కమిటీ చైర్మన్ని వెంటనే నియమించాలని.. 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవు బకాయిలను వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ నాయకులు విన్నవించారు. పీఆర్టీయూ నాయకులు చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వినతులు, డిమాండ్లు సీఎం చంద్రబాబు నెరవేర్చారు. దసరా పండుగకు డీఏ ప్రకటించగా.. పెండింగ్ బిల్లులు చెల్లించారు. ఇక మిగిలిన పీఆర్సీ, ఐఆర్ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.

































