Sri Reddy : ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డి పై కేసు

www.mannamweb.com


Sri Reddy : ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డి పై కేసు

Case filed on Sri Reddy: చేసింది తక్కువ సినిమాలే అయినా వివాదాలతో తెలుగు ప్రజలకు పరిచయమైన శ్రీరెడ్డి మీద కేసు నమోదయింది. ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ కి వీరాభిమానిగా తనను తాను చెప్పుకునే శ్రీరెడ్డి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను దూషించిన కారణంగా ఆమె మీద కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రులు నారా లోకేష్, అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని కొన్ని వీడియోలను సమర్పించడంతో ఆమె మీద కేసు నమోదు చేశారు. ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ అంటూ పెద్ద ఎత్తున టాలీవుడ్ లో కలకలం రేపిన శ్రీరెడ్డి తర్వాత తన మకాం చెన్నై మార్చిన సంగతి తెలిసిందే.

అయితే వైసీపీ మద్దతు రాలిగా ఉంటూ వస్తున్న ఆమె ఆ పార్టీకి మద్దతుగా పలు వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తోంది. అయితే ఆ వీడియోలలో టిడిపి నేతలను అసభ్యకరంగా దూషించడంతో రాజు యాదవ్ ఈ మేరకు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం నేతలను మాత్రమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కించపరిచే విధంగా ఆమె మాట్లాడుతోందని ఈ సందర్భంగా రాజు యాదవ్ పేర్కొన్నారు. ఇలా సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదని, కేవలం విషపు ఆలోచనలు ఉన్నవారు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారని ఆయన అన్నారు. ఆమెను ఆదర్శంగా చేసుకుని మిగతా వాళ్ళు కూడా తమ భాషను అసభ్యకరంగా మార్చుకోక ముందే ఇలాంటివారిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.