‘నాడు- నేడు’ పనులపై సమగ్ర విచారణ: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్

www.mannamweb.com


అమరావతి: వైకాపా ప్రభుత్వం చేపట్టిన ‘నాడు-నేడు’ పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రకటించారు. శాసనసభ రెండోరోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని తెదేపా ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్‌కుమార్‌, ధూళిపాళ్ల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

‘నాడు-నేడు’లో పెద్ద ఎత్తున దోపిడీ: దూళిపాళ్ల

ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ‘నాడు-నేడు’ ద్వారా అద్భుతాలు జరిగినట్లు వైకాపా నేతలు ప్రచారం చేసుకున్నారని.. కానీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆరోపించారు. తమకు కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టారన్నారు. తన నియోజకవర్గం పొన్నూరులో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారని సభ దృష్టికి తీసుకొచ్చారు. పాత భవనాలకే రంగులు వేసి బిల్లులు పెట్టారన్నారు. స్కూళ్లలో బాగున్న నాపరాయి ఫ్లోరింగ్‌ తీసివేసి గ్రానైట్‌ వేశారని.. దీనికోసం అంచనా వ్యయం పెంచి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. పనులు అయ్యాక కూడా పాఠశాలల్లో టాయిలెట్లు ఘోరంగా ఉన్నాయన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని కోరారు. ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ వైకాపా నేతలనే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తించారన్నారు. చాలా చోట్ల పనులు చేపట్టి కూడా స్కూళ్లను మూసివేయించారని.. ఇది దారుణమన్నారు. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఈ వ్యవస్థను గాడిలో పెడతారనే నమ్మకం అందరికీ ఉందని చెప్పారు.

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ దెబ్బతింది

అనంతరం మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు. ‘నాడు-నేడు’పై ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు? పనులు ఎందుకు సరిగా జరగలేదు?అనే అంశాలపై ఆరా తీస్తామన్నారు. ‘‘ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాం. అందుకే మెగా డీఎస్సీ వేశాం. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతాం. వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం అన్నీ చేస్తాం. తొలి ఏడాదిలో కేజీ టు పీజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడతాం’’ అని లోకేశ్‌ తెలిపారు.