కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలంటూ 2019లో దాఖలైన పిటిషన్‌పై విచారణకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మార్చి 18వ తేదీలోగా కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను అదేశించింది.


కేజ్రీవాల్, ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, మాజీ ద్వారక కౌన్సిలర్ నితిక శర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లు పెట్టారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరందరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టును కోరారు. దీనిపై అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నేహా మిట్టల్ మంగళవారంనాడు ఢిల్లీ పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆదేశాలిచ్చారు.

దీనికి ముందు 2022లో ఈ ఫిర్యాదును మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు తోసిపుచ్చారు. అయితే సెషన్ కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేస్తూ పిటిషన్‌ను పునఃపరిశీలించాలని మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’ పదేళ్ల పాలనకు బీజేపీ గండికొడుతూ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో హోర్డింగ్‌ల పేరుతో ప్రజానిధుల దుర్వినియోగంపై కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదుకు కోర్టు ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.