బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకతో ‘దేవర’ (#Devara) హ్యాష్ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతుంది.
అందుకు కారణం కూడా ఉంది. గత పదేళ్లుగా భారత్లో పలు సంగీత కార్యక్రమాలలో ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. రీసెంట్గా చెన్నైలో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్తో కలిసి పాటలు పాడి ప్రేక్షకులలో జోష్ నింపారు. తాజాగా బెంగుళూరులో జరిగిన భారీ సంగీత కచేరీలో పాల్గొన్న ఎడ్ షీరన్ ‘దేవర’ సినిమా నుంచి ఒక సాంగ్ పాడారు. దీంతో ట్విటర్లో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానులు ఆ క్లిప్ను వైరల్ చేస్తున్నారు.
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డు ‘గ్రామీ’. ఆ జాబితాలో తమ పేరు ఉండటమే అత్యున్నత గౌరవంగా చాలామంది భావిస్తారు. అలాంటిది ఎడ్ షీరన్ ఏకంగా నాలుగు ‘గ్రామీ’ అవార్డులు దక్కించుకున్నారు. అందుకే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఉన్నారు. బెంగుళూరులో ఆయన తొలి ప్రదర్శన కావడంతో టికెట్ల కోసం సంగీత ప్రియులు భారీగా పోటీ పడ్డారు. స్టేజీపైన ‘దేవర’ తెలుగు పాటను వినిపించి కన్నడ వారిలో జోష్ నింపారు. ‘దేవర’ మూవీ నుంచి యూట్యూబ్లో రికార్డు వ్యూస్ సాధించిన ‘చుట్టమల్లే..’ తెలుగు వర్షన్ సాంగ్ను ఎడ్ షీరన్ పాడారు.
ప్రముఖ సింగర్ శిల్పారావుతో ఆయన గాత్రం కలిపారు. దేవరలో ఈ పాటను అన్ని భాషల్లో శిల్పారావు ఆలపించడం విశేషం. దీంతో ఒక్కసారిగా కన్నడ అభిమానులు కేరింతలు వేశారు. వారి చూపిన ఆదరణపై ఎడ్ షీరన్ ఆశ్చర్యపోయారు. మరోసారి బెంగుళూరుకు వస్తానని మాట ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఎడ్ షీరన్ ఆదివారం ఉదయం సడెన్గా బెంగళూరులో ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి ప్రకటన లేకుండా ఫుట్పాత్పై పాటలు పాడటం ఆయన ప్రారంభించారు. అయితే, అక్కడ ఒక్కసారిగా భారీగా జనాలు వచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనొక అంతర్జాతీయ సింగర్ అని వారు గుర్తించలేకపోయారు.. అదే సమయంలో ఆయన కూడా చెప్పుకోలేదు. దీంతో అక్కడి మైక్ వైర్ను పోలీసులు తొలగించారు. కొంత సమయం తర్వాత ఈవెంట్ నిర్వాహకులు వచ్చి ఆయన గురించి పోలీసులకు అసలు విషయం చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. భారత పర్యటనలో భాగంగా పూణే, ఢిల్లీలో కూడా ఆయన కార్యక్రమాలు జరగనున్నాయి.
































