గోవాకు డైరెక్ట్‌ రైలు వచ్చేసింది..శనివారం నుంచి ప్రారంభం.. 9నుంచి అందుబాటులోకి సేవలు

www.mannamweb.com


సికింద్రాబాద్‌ నుంచి గోవాకు డైరెక్ట్ ట్రైన్ సర్వీసులు అక్టోబర్‌ 9 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 6న ప్రయోగాత్మకంగా గోవా ట్రైన్‌ ప్రారంభిస్తారు. వారంలో రెండు రోజులు వాస్కోడా గామా ట్రైన్ అందుబాటులో ఉంటుంది.

సికింద్రాబాద్‌ నుంచి గోవా వెళ్లేందుకు డైరెక్ట్‌ ట్రైన్‌ మరో రెండు రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. గత నెలలోనే ఈ రైలు మొదలు కావాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. పర్యాటకులు ఇకపై సికింద్రాబాద్‌ నుంచి గోవాకు నేరుగా చేరుకోవచ్చు. అత్యంత డిమాండ్‌ ఉన్న మార్గంలో రైల్ సర్వీస్ కోసం ప్రజల నుంచి సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉంది.

ప్రస్తుతం ఇంటర్‌ లింకింగ్‌ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక రైలు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొంతకాలంగా రైల్వే శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. పర్యాటకుల నుంచి డిమాండ్‌ ఉన్ననేపథ్యంలో కొత్త సర్వీసుకు అమోదం లభించింది.

గోవా వెళ్లే పర్యాటకుల కోసం సికింద్రాబాద్‌-వాస్కోడగమా రైలు సర్వీసును ఈ నెల 6న ప్రారంభించనున్నారు. రెగ్యులర్ ట్రైన్ సర్వీస్ అక్టోబర్‌ 9 నుంచి ప్రారంభం అవుతాయి. సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామాకు ట్రైన్‌ నంబర్‌ 17039 సర్వీసు బయల్దేరుతుంది. ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలు ప్రారంభం అవుతుంది. 9వ తేదీన మొదటి ప్రయాణికుల రైలు స్టార్ట్ అవుతుంది.

తిరుగు ప్రయాణంలో వాస్కోడగామా-సికింద్రబాద్‌ 17040 రైలు ప్రతి గురు, శనివారం ఉంటుంది. ప్రస్తుతం సికింద్రబాద్ నుంచి వాస్కోడగామాకు రెగ్యులర్ సర్వీస్‌ 17603 రైల్లో తీవ్ర రద్దీ ఉంటోంది. ఈ రైలు మంగళవారం, బుధవారం, శుక్ర, ఆదివారాల్లో నడుస్తుంది. ట్రైన్ నంబర్ 17021 సర్వీస్‌ వారంలో ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త రైలు రాకతో ప్రయాణికుల కష్టాలు కొంత మేరకు తీరుతాయి.

గోవా డెస్టినేషన్…

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి గోవాకు వెళ్లాలంటే రోడ్డు మార్గంలోనో, ఫ్లైట్లోనే వెళ్లాల్సి వచ్చేది. డైరెక్ట్ ట్రైన్‌ తగినన్ని లేకపోవడంతో ఉన్న రైలు కూడా గుంతకల్లులో బోగీలను మార్చుకుని వెళ్లాల్సి వస్తుండటంతో గోవా ప్రయాణం ప్రహసనంగా ఉండేది. గోవాకు నేరుగా రైలును ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో పర్యాటకుల నుంచి డిమాండ్ ఉంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు రైలు మార్గంలో వెళ్లాలంటే హౌరా వాస్కోడిగామా రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. లేదంటే విజయవాడ నుంచి గుంతకల్లు మీదుగా హుబ్లీ వరకు వెళ్లి అక్కడి నుంచి మరో రైల్లో వాస్కోడిగామా చేరుకోవాల్సి వచ్చేది.

హౌరా-వాస్కో రైల్లో బెర్తులు లభించడం అంత సులువు కాదు. బెంగాల్, ఒడిశాల మీదుగా వచ్చే రైల్లో ఏసీ బోగీల్లో సైతం ప్రయాణం నరకంలా ఉంటుంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు సైతం ఏసీ బోగీల్లోకి వచ్చేస్తుంటారు. వారిని నియంత్రించడంలో రైల్వే టీటీఈలు చేతులెత్తేస్తుంటారు. దీంతో తరచూ వివాదాలు గొడవలు పరిపాటిగా ఉంటుంది.

విజయవాడ నుంచి బయల్దేరే అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో హుబ్లీ వరకు ప్రయాణానికి 16గంటలు పైనే పడుతుంది. అక్కడి నుంచి వాస్కో, మాడ్గవ్ వంటి స్టేషన్లకు మరో మూడు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది.

హైదరాబాద్‌ నుంచి ప్రయాణం మరీ కష్టం..

ఇక హైదరాబాద్ నునంచి గోవాకు వెళ్లాలనుకువారికి ప్రయాణం మరింత కష్టంగా ఉంటుంది. కనెక్టింగ్ రైల్లో వెళ్లడం కంటే నైట్ స్లీపర్ బస్సుల్లో గోవా ప్రయాణం కాస్త సులువు అనిపించేలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో గోవాకు డైరెక్ట్ ట్రైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. తాజాగా దీనిపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ – వాస్కోడిగామా రైలు సర్వీసును ఈ వారం అందుబాటులోకి తీసుకు రానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వీక్లీ సర్వీసుగా కాచిగూడ నుంచి నాలుగు బోగీలను వాస్కో రైలుకు కలుపుతున్నారు. వీటిలో రెండు సాధారణ బోగీలు, ఏసీ, స్లీపర్ బోగీలను గుంతకల్లులో గోవా రైలుతో కలిపే వారు.

సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలు నడపాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ రాయడంతో రైల్వేశాఖ స్పందించింది. ఈ వారంలో డైరెక్ట్ సర్వీసును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు వీలుగా ఈ రైలు సమయాలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏటా దేశంలో 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాకు వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 15-20లక్షల మంది గోవాకు వెళుతుంటారు.

నేరుగా గోవాకు రైళ్లు లేకపోవడం, ఉన్న రైళ్లలో ప్రయాణం నరకంలా ఉండటంతో సొంత వాహనాలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళుతున్నారు. ఇకపై ప్రతి బుధవారం, శుక్ర వారాం సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామకు డైరెక్ట్‌ రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు.

గురువారం, శనివారాల్లో వాస్కోడిగామా, మాడ్గవ్‌ నుంచి సికింద్రా బాద్‌ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఏపీ ప్రయాణికులు కూడా ఈ రైలు సదుపాయాన్ని వినియోగించుకునేలా కనెక్టివిటీ కోసం టైమ్ టేబుల్ రూపొందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.