Dishti: దిష్టి అంటే ఏమిటి? పిల్లలకు ఎలా దిష్టి తీయాలి? అందుకు అనుసరించాల్సిన విధానం ఏంటి?

ఇంట్లో పిల్లలు అదే పనిగా ఏడుస్తుంటే వారికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. ఇతరులు మన సంతోషం చూసి అసూయ పడటాన్ని కూడా దిష్టి అంటారు. దీని వల్ల ఈర్ష్య అసూయ భావాలతో లేదా ఆరాధనా భావం లేదా ప్రేమభావంతో భావోద్వేగాలకి గురైనప్పుడు మనకు ఇబ్బంది కలుగజేసే అవకాశం ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పిల్లలకు దిష్టి తీయటం చాలా ఇళ్లల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది. అందులోను పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు. దిష్టి తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు.


అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దాని వల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు. చిన్నారులకు దిష్టి తీసేటపుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని, కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారుని చిలకమర్తి తెలిపారు.

పిల్లలకు దిష్టి ఎలా తీయాలి?
కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుక పెడతారు. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీస్తారు. ఆ ఉప్పుని రోడ్డు మీద నలుగురు తిరిగే చోట వేస్తే దిష్టి తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు.

ఐదేళ్ళు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు, కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కిందపడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకుని పిల్లలకు మూడు సార్లు తిప్పి పక్కన తీసేయాలి. కర్పూరం కరిగేట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసి పిల్లలని చీకటి పడిన తర్వాత, మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు.
రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. తల్లి దిష్టి.. అన్నీ తుడిచి పెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలని చిలకమర్తి తెలిపారు.

రేణుకా దేవి స్మరణ

ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తలమీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్‌ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకా దేవిని స్మరించుకోవాలి. రేణుకా దేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు అని అంటారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

దిష్టి తగలకుండా ఉండాలంటే?

ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొడతారు. కొంతమంది భోజనం చేసేటప్పుడు ప్లేటు చుట్టూ ఒక ముద్ద దిష్టి తీసి కాకికి పెడతారు. ఇంటికి వచ్చిన వారికి ఫలం, పానీయం ఇస్తారు. పితృ దేవతలను, భగవంతుడిని తలుచుకుని వారికోసం ఒక ముద్ద పక్కన పెడతారు.

నుదుట బొట్టు పెట్టుకోవడం, నల్ల మొలతాడు కట్టుకోవడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం, కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం, తినే ఆహార పదార్ధాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం కూడా దిష్టి తీసే విధానాలు.

కొంతమంది ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ మాత, గౌరి దేవి తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కూడా దిష్టి తీయడంలో ఒక భాగమే.

కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం, మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటి పనులు దిష్టి తగలకుండా చేస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.