మీకు ఈ-శ్రామిక్ కార్డ్ ఉందా? ప్రతిరోజూ 33,000 మంది కొత్త వ్యక్తులు చేరుతున్నారు, ఆలస్యం చేయకండి.

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇ-శ్రామ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 30.58 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదయ్యారు. ఈ కార్మికులు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి నేరుగా లాభం పొందుతున్నారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 3న లోక్‌సభలో కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. 2024లో మాత్రమే 1.23 కోట్ల మంది కొత్తగా రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 33,700 మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.


ఇ-శ్రామ్ పోర్టల్ అంటే ఏమిటి?

2021 ఆగస్టు 26న కార్మిక, ఉపాధి శాఖ ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది 22 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 12 కేంద్ర శాఖల పథకాలతో లింక్ అయింది. ఈ పోర్టల్ ద్వారా అసంఘటిత రంగ కార్మికుల డేటా సేకరించి, వారికి సామాజిక సురక్షా పథకాలు కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం.

ఎలా నమోదు చేసుకోవాలి?

ఇ-శ్రామ్ పోర్టల్‌లో నమోదు చాలా సులభం. మీరు స్వయంగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయవచ్చు లేదా దగ్గరలోని సీఎస్సీ (Common Service Centre)కి వెళ్లి సహాయం పొందవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్లు:

  • ఆధార్ కార్డు
  • బ్యాంక్ ఖాతా వివరాలు
  • మొబైల్ నంబర్

ఇ-శ్రామ్ కార్డు ఉన్నవారికి లభించే ప్రయోజనాలు

ఇప్పటివరకు 12 ప్రధాన పథకాలతో ఈ పోర్టల్ అనుసంధానించబడింది. ప్రముఖ పథకాలు:

  • ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)
  • జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)
  • ఆయుష్మాన్ భారత్
  • PM-SVANidhi
  • PM ఆవాస్ యోజన

ఎవరు అర్హులు?

కింది అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకాలకు అర్హులు:

  • స్ట్రీట్ వెండర్లు
  • చిన్న షాపుల యజమానులు
  • కూరగాయలు, పాలు అమ్మేవారు
  • నిర్మాణ కార్మికులు
  • ఆటో, రిక్షా డ్రైవర్లు
  • గార్బేజ్ కలెక్టర్లు
  • ధోబీలు, దర్జీలు
  • బస్ డ్రైవర్లు, కండక్టర్లు
  • ఇతర సేవా రంగ కార్మికులు

ఇంకెందుకు ఆలస్యం? ఇ-శ్రామ్ కార్డును ఇప్పుడే తీసుకోండి – ప్రభుత్వ యోజనలు మీ జీవితాన్ని సురక్షితం చేసే మార్గం అవుతాయి!