ఎనర్జీని పెంచే బార్స్.. ఇంట్లోనే ఈజీగా చేయవచ్చు..

www.mannamweb.com


రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే అందుకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. ఎనర్జీని పెంచే ఆహారాలు తీసుకోవడం వల్ల ఉల్లాసంగా, ఉత్సహంగా ఉంటారు. ఆఫీసు పనులు చేసేవారు, గట్టి పనులు చేసేవారు వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది.

దీని వల్ల బలంగా, దృఢంగా ఉంటారు. అంతేకాకుండా పిల్లలకు కూడా ఈ ఎనర్జీ బార్స్ ఇవ్వడం వల్ల వారు కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఎనర్జీని పెంచే బార్స్‌ని చాలా మంది బయట కొనుక్కుంటారు. దాని కంటే ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితో శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అందుతాయి.

ఎనర్జీ బార్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఎండు ఖర్జూరం, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, నువ్వులు, వేరుశనగ పప్పు, ఉప్పు లేని పిస్తా పప్పు, గుమ్మడి గింజలు, తేనె, యాలకుల పొడి, ఓట్స్.

ఎనర్జీ బార్ తయారీ విధానం:

ముందుగా ఎండు ఖర్జూరాన్ని శుభ్రంగా కడిగి.. వేడి నీటిలో నానబెట్టాలి. కనీసం గంట సేపు అయినా నానబెట్టాలి. ఇప్పుడు ఈ ఖర్జూరంలో విత్తనాలు తీసేసి.. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. ఇందులో ఒకదాని తర్వాత మరొకటి వేసి.. వేయిస్తూ ఉండాలి. కావాలి అనుకునేవారు ఎండు కొబ్బరి తురుమును కూడా వేయించి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇదే కడాయిలో చివరగా ఓట్స్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మిక్సీ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని ఇందులోనే ముద్దగా ఉన్న ఖర్జూరం వేసి నీరంతా ఇంకిపోయే వరకు చిక్కబడేలా వేయించాలి. నెక్ట్స్ ఇందులో డ్రైఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి.. తేనె వేసి మరోసారి అంతా కలుపుకోవాలి. ఆ తర్వాతే ఓట్స్ పొడి కూడా వేయాలి. ఇందులో పంచదార వేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ట్రైలోకి వేయాలి. కట్ చేసి.. పైన మూత పెట్టి.. గంటసేపు వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే బార్స్ తయారైనట్టే.