ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుండంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఎన్నికలకు ముందు టిడిపి కూటమి ఇచ్చిన హామీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న వేళ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి చెప్పిందిదే

పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలుపై పూర్తిస్థాయిలో రివ్యూ నిర్వహించి, అక్కడి లోటుపాట్లను గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పకడ్బందీగా పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మహిళలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మంత్రి పేర్కొ న్నారు.

కుప్పంలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి

అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పంలో కొత్త ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి వైసిపి నేతలు ఆర్టీసీ స్థలాలను దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడుతామన్నారు.

ఏపీఎస్ఆర్టీసీని 100% ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కృషి

గత ప్రభుత్వం ఏ శాఖనూ వదలకుండా అన్ని శాఖలలోనూ అవినీతికి పాల్పడిందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఏపీఎస్ఆర్టీసీని 100% ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో వీలైనన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇక రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సులను ఫ్రీగా వాడబోమని స్పష్టం చేశారు జగన్ మాటలను జనం వినే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.

ఐదేళ్ళపాటు మహిళలకు ఫ్రీ బస్

జూన్ 23వ తేదీన సచివాలయం నాలుగో బ్లాక్లో ఉన్న ఛాంబర్ లో రవాణా మరియు క్రీడల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు పైన తొలి సంతకం చేశారు. ఇక తన శాఖలో పనులు పరుగులు పెట్టిస్తున్న ఆయన తాజాగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం పైన గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న ఐదేళ్లు మహిళామణులకు తప్పనిసరిగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు.